Viral news: కారుతో ఢీ కొట్టి.. బానెట్‌పై వేలాడుతున్నా ఆపకుండా..!

బెంగళూరులో ఓ మహిళ దర్శన్‌ అనే వ్యక్తిని ఢీ కొట్టింది. అతడు బానెట్‌పై వేళాడుతున్నా పట్టించుకోకుండా అలా కిలోమీటరు దూరం వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 20 Jan 2023 21:42 IST

బెంగళూరు: ఢీ కొట్టిన తర్వాత వాహనాన్ని ఆపకుండా బాధితులను ఈడ్చుకుంటూ వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దిల్లీ (Delhi)లో ఓ మహిళను ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే  అలాంటి తరహా సంఘటనే బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన ప్రియాంక అనే మహిళ జ్ఞానభారతి నగర్‌ రోడ్డులో దర్శన్‌ అనే వ్యక్తి కారును ఢీ కొట్టారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, అక్కడి నుంచి  వెళ్లిపోతున్న ప్రియాంకను ఆపేందుకు అతడు ప్రయత్నించాడు. కోపంతో ఆమె ఆగకుండా దర్శన్‌ పైకి కారును పోనిచ్చారు. దీంతో అతడు కారు బానెట్‌పై పడిపోయాడు. ఓ వైపు అతడు వేలాడుతున్నా పట్టించుకోకుండా దాదాపు కిలోమీటరు మేర  కారు ఆపకుండా వెళ్లిపోయారు. ప్రమాదం నుంచి బయటపడిన దర్శన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియాంక కూడా తన కారును ఢీ కొట్టాడంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న మరో ముగ్గురు నిందితులు యశ్వంత్‌, సుజన్‌, వినయ్‌ల కోసం గాలిస్తున్నారు. ప్రియాంకపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని