
ఎమ్మెల్సీ కవిత పేరుతో రూ.6లక్షలు టోకరా!
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి ఇద్దరు యువకులు ఓ వ్యక్తికి టోకరా వేశారు. మొత్తం రూ.6.5 లక్షలు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణానికి చెందిన మహేశ్ గౌడ్, వినోద్ అనే యువకులు కవిత పేరుతో న్యూస్ ఛానల్ పెడుతున్నామని మహ్మద్ అలియాస్ స్వామిని నమ్మించారు. మొదట అతని నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఛానెల్ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి వేరే ఛానల్లో కెమెరామెన్గా అవకాశం కల్పిస్తామని మరో రూ.50 వేలు తీసుకొని ఐడీ కార్డు ఇచ్చారు. ఆపై కవితతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పి రెండు పడక గదుల ఇంటి కోసం మరో రూ.4 లక్షలు తీసుకున్నారు. నెలలు గడిచినా ఇల్లు, ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వమనడంతో మరో వారం ఆగాలని కోరారు. దీంతో వీరిద్దరి మోసాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు నిందితులు మహేశ్ గౌడ్, వినోద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ తెలిపారు.