Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం.. ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్‌తో ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. ఇది వైకాపా నేతల పనేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన తమపైనా దాడి చేశారని మృతురాలి కుమార్తె కన్నీటి పర్యంతమవుతున్నారు.

Updated : 05 Jun 2023 16:57 IST

కొండపి: ప్రకాశం జిల్లా కొండపిలో దారుణం జరిగింది. ట్రాక్టర్‌ ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. అయితే, ఇది వైకాపా నేతలే పనేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన తమపైనా దాడి చేశారని మృతురాలి కుమార్తె కన్నీటి పర్యంతమవుతున్నారు. కొండపి నియోజకవర్గంలోని తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఓ వైపు గొడవలు జరుగుతుండగా.. మరోవైపు తెదేపా నాయకుడి భార్య మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. వైకాపాకి చెందిన నాయకులు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి.. హత్య చేశారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

తెదేపా నాయకుడు సుధాకర్‌ భార్య హనుమాయమ్మ టంగుటూరి మండలం రాయవారిపాలెంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వైకాపా నాయకులు పిలుపునివ్వడంతో ఎమ్మెల్యేకు మద్దతుగా సుధాకర్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి స్వగ్రామమైన నాయుడు పాలెం వెళ్లారు. అదే సమయంలో రాయవారిపాలెంలో విధులు నిర్వర్తిస్తున్న హనుమాయమ్మపై సమీప బంధువైన వైకాపా నాయకుడు కొండలరావు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో ప్రహరీ కూడా కూలిపోయిందని, శిథిలాల కింద హనుమాయమ్మ ఉండగానే.. ట్రాక్టర్‌ను ఆమె మీదుగా పోనిచ్చారని మృతురాలి కుమార్తె విలపించారు. అడ్డుకునేందుకు యత్నించిన తనపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన హనుమాయమ్మను అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. పొలం విషయంలో కొండలరావు కుటుంబానికి, తమకు వివాదం ఉందని, దీనికి తోడు తాను తెదేపాలో చురుగ్గా ఉండటం సహించలేకే.. తన భార్యపై దాడి చేసి హత్య చేశారని ఆమె భర్త సుధాకర్ ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని