Crime News: అనుమానంతో భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానమే పెనుభూతమై భార్య గొంతు కోసి హతమార్చాడు ఓ కిరాతక భర్త

Updated : 30 Jul 2021 01:35 IST

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్‌కు చెందిన ఆసిఫ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 18 ఏళ్ల క్రితం అశోక్ నగర్‌కు చెందిన సాహి నీతో వివాహం జరిగింది. ఆసిఫ్ నెల రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య మరొకరితో సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించాడు.

దీనిలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం తన కుమారుడు సాహెల్‌ను ఏదో పని మీద ఇంటి నుంచి బయటకు పంపించాడు. ఇదే సమయంలో కూతురు తమన్నా స్నానం చేస్తున్న సమయంలో టీవీ శబ్దం పెంచి కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. హత్య చేసిన వెంటనే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతుండడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని మృతురాలి తల్లి సుల్తానా పోలీసులకు తెలిపారు. భార్యాపిల్లలను బాగా చూసుకుంటానని చెప్పడంతోనే కూతుర్ని పంపించానని సుల్తానా పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రెహ్మాన్, సీఐ రాజు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని