logo

కోతలేని కు.ని. పట్టించుకోరెందుకని?

రెండు జిల్లాలకు పెద్దదిక్కు మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి. శస్త్రచికిత్స ఏదైనా ఇక్కడికి రావాల్సిందే.

Published : 27 Nov 2022 03:43 IST

పురుషులు ముందుకొస్తున్నా చేయలేని పరిస్థితి

జీజీహెచ్‌లోని పీపీపీ యూనిట్‌ గది

మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే: రెండు జిల్లాలకు పెద్దదిక్కు మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి. శస్త్రచికిత్స ఏదైనా ఇక్కడికి రావాల్సిందే. ప్రస్తుతం వ్యాసెక్టమీ పక్షోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. జిల్లాలోనూ వారం రోజులుగా ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోత, కుట్టులేని పురుషులకు చేసే ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సపై వివరిస్తున్నారు. సోమవారం నుంచి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ (కు.ని.) చికిత్సలు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు వీటి నిర్వహణపై ఎలాంటి కదలిక లేదు. జిల్లాలో ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు..? ఎంతమంది వ్యాసెక్టమీ చేసుకునేందుకు ముందుకొచ్చారు..? అనే దానిపై స్పష్టత లేదు. పక్షోత్సవాలను పురస్కరించుకుని కొంతమంది ఆశావహులు జీజీహెచ్‌ బాట పడుతున్నట్లు తెలిసింది. పీపీపీ(పోస్ట్‌ పార్టమ్‌ ప్రోగ్రాం) యూనిట్‌ సిబ్బంది వారి పేరు నమోదు చేసుకుని చికిత్సలు నిర్వహించే సమయంలో సమాచారం అందిస్తామని చెబుతున్నారు తప్ప కచ్చితమైన తేదీ సూచించడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

వైద్యుడు లేరు.. శస్త్రచికిత్స గదీ లేదు

వ్యాసెక్టమీపై గతంలో మాదిరి కాకుండా చాలా వరకు ఈ చికిత్సపై మగవారు అవగాహన పొంది దీన్ని చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వైద్య సిబ్బందే తెలుపుతున్నారు. ఇటీవల మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ నుంచి వస్తున్నారని పీపీపీ యూనిట్‌ సిబ్బంది చెబుతున్నారు. వచ్చిన వారి వివరాలు నమోదు చేస్తుండటంతో పుస్తకంలోని పేజీలు నిండుతున్నాయి కానీ చికిత్సలు జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యాసెక్టమీ చేసే ఒక్క వైద్యుడు లేకపోవడం, సంబంధిత గది అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం.

శిక్షణ ఇస్తే నిత్యం చేసే అవకాశం..

వ్యాసెక్టమీ(కుట్టు, కోతలేని)చికిత్సకు తప్పనిసరిగా ప్రసూతి వైద్యులు, సర్జన్లు ఉండాల్సిన అవసరంలేదు. ఎంబీబీఎస్‌ వైద్యులు కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాసెక్టమీ చేసే అర్హత ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులకు(ఎంబీబీఎస్‌)ఉంది. అయినా ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. వీరికి ఒక శిబిరం ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే నిత్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. బాధితులు సైతం జిల్లా కేంద్రం బాట పట్టాల్సిన అవసరముండదు.

ఏర్పాట్లు చేస్తున్నాం

డా.సుబ్బారాయుడు, జిల్లా వైద్యాధికారి

వ్యాసెక్టమీ పక్షోత్సవాల్లో భాగంగా ఈ చికిత్సపై అవగాహన కల్పిస్తున్నాం. ముందుకు వస్తున్న వారికి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 28 నుంచి జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్‌, బెల్లంపల్లిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాం. ఈ చికిత్సలు నిత్యం జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని