logo

తనిఖీ పేరిట దోచుకుంటున్నారు

అంతర్జాలంలో చరవాణులకు సందేశాల ద్వారా ఏదో ఆశ చూపి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పట్టణం, గ్రామీణం అనే తేడా లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.

Updated : 01 Dec 2022 07:24 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేరవిభాగం

అంతర్జాలంలో చరవాణులకు సందేశాల ద్వారా ఏదో ఆశ చూపి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పట్టణం, గ్రామీణం అనే తేడా లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి తోడు తనిఖీ అధికారులమంటూ కొందరు మరో కొత్త రకం మోసాలకు పాల్పడటం మొదలెట్టారు. ఆదాయపన్ను, జీఎస్‌టీ, ఇతరత్రా శాఖల అధికారులమంటూ మెట్రోపాలిటన్‌ పట్టణాలు, పెద్ద నగరాల్లో వ్యాపారులను మోసగించే ఘటనలు అప్పుడప్పుడు వింటుంటాం. ఇలాంటివి ప్రస్తుతం చిన్న నగరాలు, పట్టణాలకు వ్యాపించాయి. ఆగంతకులు వారి మోసాలను ఇలాంటి పట్టణాలకు విస్తరించినట్లు ఇటీవల ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. తాము తనిఖీ అధికారులమంటూ నమ్మించి నగదు కాజేస్తున్నారు.
ఆదిలాబాద్‌ పట్టణంలోనే ఇలాంటి రెండు ఘటనలు వెలుగు చూశాయి. ఆదాయ పన్ను, జీఎస్‌టీ అధికారులమని చెప్పి మోసం చేసి నగలు, నగదు దోచుకుపోయారు. ఈ రెండు సంఘటనల్లో బాధితులు ఫిర్యాదు చేయటంతో.. వెలుగులోకి వచ్చాయి. వెలుగు చూడని ఇలాంటివి మరిన్ని ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.

దర్జాగా నగలు తీసుకెళ్లి..

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఐటీ అధికారినంటూ గతేడాది జనవరిలో ఒక నగల దుకాణానికి వచ్చాడు. యజమానిని పరిచయం చేసుకొని జీఎస్‌టీ ధ్రువపత్రాలు పరిశీలించాడు. అనంతరం స్నేహపూర్వకంగా మెలుగుతూ ఒక బంగారు గొలుసు, మరొక బంగారు కాయిన్‌ కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన రూ.1.87 లక్షలు నెఫ్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించినట్లు నమ్మించి యజమానికి చెల్లింపుల స్క్రీన్‌షాట్ పంపించడంతో యజమాని నమ్మారు. దుకాణం మూసే సమయంలో వారు తమ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. డబ్బు జమ్మ కాలేదని తెలుసుకొని మోసపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు యజమాని ఒకటో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించినా నేటికీ ఆ ఆగంతకుడి ఆచూకీ లభించలేదు.


రూ.5 లక్షలు దోచేసి  

ఇటీవల జిల్లా కేంద్రంలోని ఒక మాల్‌(వస్త్ర దుకాణం) యజమానికి ఇంద్రవెల్లికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఫోన్‌ చేసి తాను జీఎస్‌టీ టాస్క్‌ఫోర్సు అధికారినని పరిచయం చేసుకున్నాడు. దుకాణానికి సంబంధించిన జీఎస్‌టీ చెల్లింపులు సరిగా లేవని, మాట్లాడాలని లాడ్జికి యజమానిని పిలిపించుకున్నాడు. అక్కడ అతనిపై సుత్తితో దాడి చేసి తాడుతో కట్టేసి భయాందోళనలకు గురిచేశాడు. అనంతరం తాను ఒక మాఫియా వ్యక్తినని భయపెట్టి, మీ కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ వ్యాపారి డబ్బు చెల్లించాడు. పరువు పోతుందని భావించి కొన్నాళ్లు ఫిర్యాదు చేయలేదు. ఒక స్నేహితుడికి విషయం తెలిసి అతని ద్వారా ఫిర్యాదు చేయించడంతో.. పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లాడ్జిలో యజమానిపై దాడి చేయటానికి ఉపయోగించిన సుత్తి, కత్తి, నైలాన్‌ తాడు చిత్రమే ఇది.


ఫిర్యాదు చేయాలి
- ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ

గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అధికారులమంటూ లేదా మరే రకంగానైనా మోసం చేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. అప్పుడే పోలీసులు బాధితులకు న్యాయం చేయగలుగుతారు. మోసపోయి పరువు పోతుందని భావించి మిన్నకుండిపోతే ఇలాంటి వారు మళ్లీ మళ్లీ మోసాలకు తెగబడుతూనే ఉంటారు. ఇటీవల ఇలాంటి మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని