logo

భార్యను హత్య చేసిన భర్త

భార్యపై పగ పెంచుకున్న భర్త ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాంలో చోటు చేసుకుంది.

Published : 19 Jan 2023 22:16 IST

భైంసా: భార్యపై పగ పెంచుకున్న భర్త ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేగాం గ్రామానికి చెందిన సట్ల జ్యోతి అలియాస్ సురేఖ(28)కు అదే గ్రామానికి చెందిన సట్ల రమేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆరు సంవత్సరాల లోపు వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ పనిచేయకుండా బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. తరచూ డబ్బులు ఇవ్వాలంటూ భార్యతో గొడవ పడేవాడు. స్థానిక బీడి పరిశ్రమలో ప్యాకింగ్ కార్మికురాలిగా పనిచేస్తున్న సురేఖ భర్త వేధింపులు తాళలేక కొన్నాళ్లు పిల్లలతో పుట్టింటికి వెళ్లి వచ్చేది. ఇటీవల పుట్టింటి నుంచి వచ్చిన ఆమెపై భర్త పగ పెంచుకున్నాడు. అప్పటికే ఆరోగ్యం బాగా లేని ఆమె గురువారం బీడీ కంపెనీకి సెలవు ఉండటంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న రమేశ్‌ మధ్యాహ్నం భార్యతో గొడవపడి మెడలోని పూసాల తాడు(దారం)తో ఉరేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న గ్రామీణ సీఐ చంద్రశేఖర్, ఏఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తండ్రి జలన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని