logo

చోరీలు ఎక్కువ.. చిక్కేది తక్కువ

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏటా చోరీలు పెరుగుతున్నా.. అందులో పోలీసులు ఛేదిస్తున్నవి పదుల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి.

Updated : 23 Jan 2023 04:38 IST

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

* కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం న్యూకాలనీ ఉద్యోగులు ఓఆర్‌టీ-363, దాని వెనుక భాగంలోని ఓఆర్‌టీ-308లో ఇంటి యజమానులు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి వచ్చేలోపు ఆ రెండు క్వార్టర్ల తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.


* తాజాగా కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తి పండ్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు.

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏటా చోరీలు పెరుగుతున్నా.. అందులో పోలీసులు ఛేదిస్తున్నవి పదుల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా జరుగుతున్న దొంగతనాల్లో నిందితులు ఎంతకూ చిక్కకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. సీసీ కెమెరాల్లో ఆధారాలు లభించినప్పటికీ దొంగలు పోలీసులకు చిక్కడం లేదు.

జిల్లాలోని కాగజ్‌నగర్‌ పురపాలికతో పాటు పలు మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు చిన్న చిన్న వస్తువుల విక్రయాల పేరిట పట్టణం, మండలాల్లో పర్యటిస్తుంటారు. ఆ సమయంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, మరుసటి రోజు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2022లో జిల్లాలో 124 నేరాల్లో రూ.76.04 లక్షల విలువైన నగలు, బంగారం ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. 47 కేసులు పరిష్కరించి రూ.17.36 లక్షలు రికవరీ చేశారు. మిగతా కేసులు విచారణలోనే ఉన్నాయి.

దృశ్యాలు కనిపించినా..

2022 నవంబరు 17న కాగజ్‌నగర్‌ ప్రయాణ ప్రాంగణం ఏరియాలో నిలిపిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. 18న ఆ లారీ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లినట్లు ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీలు పోలీసులకు లభించినప్పటికీ ఇప్పటికీ ఆ లారీని పట్టుకోలేక పోయారు.


* 2022 డిసెంబరు 1న పెట్రోల్‌పంపు ఏరియాలోని టీచర్స్‌ కాలనీలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ జరుగ్గా, దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ముందస్తు సమాచారంతోనే కట్టడి..

ఎస్పీఎం క్వార్టర్లలోని ఉద్యోగులు ఊళ్లకు వెళితే ఎస్పీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌ఓ)కు ముందస్తు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. పట్టణవాసులు, మండలాల పరిధిలోని వారు సైతం ఊర్లకు వెళితే విలువైన నగలు, నగదు ఇంట్లో ఉండకుండా జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.

2022 డిసెంబరు 2న కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీనగర్‌లోని ఆదర్శ కాలనీలో వ్యాపారి సురేష్‌ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఆ సమయంలో సురేష్‌ భార్య అన్నపూర్ణ ఒక్కరే ఉండటంతో అరిస్తే చంపేస్తానంటూ(హిందీ)లో బెదిరించాడు. ఈ ఘటనలో అయిదు తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఆ ఇంటి ఆవరణలోని సీసీ కెమెరా ఫుటేజీలు, కాలనీలోని కెమెరాల్లో ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు ఆధారాలు లభించాయి. నేటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.


ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం

కరుణాకర్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేసి ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం జరిగిన చోరీలపై సమగ్ర విచారణ జరుగుతోంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని