logo

గైర్హాజరైన అధికారులపై చర్యలకు పట్టు

జిల్లా పరిషత్‌ సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు నోటీసులు జారీచేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్‌ నేత పాలనాధికారి భారతి హోళ్లికేరి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మిలకు సూచించారు.

Published : 26 Jan 2023 05:21 IST

సమావేశంలో మాట్లాడుతున్న పాలనాధికారి భారతి హోళ్లికేరి, చిత్రంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి, అధికారులు

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు నోటీసులు జారీచేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్‌ నేత పాలనాధికారి భారతి హోళ్లికేరి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మిలకు సూచించారు. బుధవారం జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి అధికారుల పనితీరు మచ్చలాగా మారుతుందని మండిపడ్డారు. సమావేశాలను నామమాత్రంగా నిర్వహించడం బాధాకరమన్నారు. గూడెం గుట్ట వద్ద భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న మద్యం దుకాణాలను సత్వరమే మూసివేయాలని ఎక్సైజు శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రైతులకు కరెంటు కోతలు లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. రైస్‌ మిల్లుల నుంచి రేషన్‌ బియ్యం సన్నబియ్యంగా మారుస్తున్నారంటూ సభ్యులు అడగగా.. పౌరసరఫరాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్య్స, నీటి పారుదల శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా సమావేశాలను నిర్వహించాలని సూచించారు.

* సమావేశానికి అధ్యక్షత వహించిన ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తాండూరు కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారని డీఈవో వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పనులు చేయించడమేమిటని నిలదీశారు. సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.

* పాలనాధికారి భారతి హోళ్లికేరి మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగి పింఛన్లు అందని దివ్యాంగులు ఉన్నట్లయితే అధికారులను సంప్రదిస్తే వారికి పింఛన్లు మంజూరు చేసేలా కృషిచేస్తామన్నారు. పడకల సంఖ్యను పెంచినందున బెల్లంపల్లి ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం పైపులైను పనుల్లో నిర్లక్ష్యంపై జడ్పీటీసీ సభ్యుడు సత్తయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించి పనులపై పర్యవేక్షణ చేసేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తామన్నారు.

* సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని రహదారుల నిర్మాణం పనుల్లో జాప్యంపై సంబంధిత శాఖల అధికారులపై మండిపడ్డారు. మూడేళ్లుగా నీల్వాయి వంతెన నిర్మాణం పనులు కొనసాగుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. పలు శాఖల అధికారులు వారి నివేదికలను చదివి వినిపించగా సభ్యులు అడిగిన సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

* డీసీసీబీ ఛైర్మన్‌ భోజారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కోరారు. రహదారుల పనుల్లో జాప్యంపై, అర్హులకు పింఛన్ల అందజేత విషయంలో, విద్యార్థులకు సరిపడా ఏకరూప దుస్తుల గురించి తదితర సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. అదనపు పాలనాధికారి రాహుల్‌, జడ్పీ సీఈవో నరేందర్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ తిప్పని లింగయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ భోజారెడ్డి, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ప్రోటోకాల్‌ అంశంపై ఎంపీ ఆగ్రహం


జడ్పీ సీఈవో నరేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీ వెంకటేష్‌ నేతను తీసుకెళ్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య

ప్రోటోకాల్‌ అంశంపై మంచిర్యాల జిల్లా పరిషత్‌ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్‌పై పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఎంపీ వెంకటేష్‌ నేత.. వచ్చీ రాగానే తనకు ముందువరుసలో చివరకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఈ క్రమంలో ‘సర్‌ మీరు ఎమ్మెల్యేలు కూర్చునే వైపునకు రావాలి’ అని జడ్పీ సీఈవో నరేందర్‌ ఎంపీకి సూచించారు. దీంతో ఎంపీ నాకు ఇదే సీటు కేటాయించారుగా.. దీనికి బాధ్యులెవరంటూ ఆయనను ప్రశ్నించారు. సదరు అధికారి వివరణ ఇస్తుండగానే ఎంపీ వెంకటేష్‌ తన సీటులోంచి లేచి ప్రోటోకాల్‌ అంశంపై  జడ్పీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎంపీని శాంతింపచేసి సీటులోకి తీసుకుని వచ్చారు. అధికారులు జడ్పీ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు తొలుత వేర్వేరుగా ప్రత్యేకంగా సీట్లను కేటాయించినప్పటికీ.. ఎంపీకి సంబంధించిన సీటుపై ఉంచిన నామఫలకం బోర్డును చివరి సీటుకు మార్చారు. దీన్ని ఎవరూ గ్రహించకుండా ఉన్న క్రమంలోనే ఎంపీ వెంకటేష్‌ నేత సమావేశానికి వచ్చారు. వచ్చీ రాగానే సీటు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని