logo

శాటిలైట్‌ చిత్రాలే ఆధారం!

పోడు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో శాస్త్రీయ ఆధారాల ద్వారానే అర్హులను గుర్తించాలని, ప్రాథమిక ఆధారాలుగా శాటిలైట్‌ చిత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన శాఖ మరోసారి స్పష్టం చేసింది.

Published : 04 Feb 2023 04:28 IST

జిల్లాస్థాయి కమిటీతో మరోసారి పరిశీలన

దరఖాస్తుదారులు ఎక్కువ.. అర్హులు తక్కువ  

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం: పోడు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో శాస్త్రీయ ఆధారాల ద్వారానే అర్హులను గుర్తించాలని, ప్రాథమిక ఆధారాలుగా శాటిలైట్‌ చిత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో అనేక మంది పోడు భూములు సాగు చేస్తున్నట్లుగా దరఖాస్తు చేసుకున్నా.. శాటిలైట్‌ చిత్రాలతో పోల్చి చూస్తే చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పోడు భూముల కోసం 43,150 మంది దరఖాస్తు చేసుకుంటే మండల, గ్రామ కమిటీలు సర్వే చేసి 29 వేల మందిని అర్హులుగా గుర్తించారు. తర్వాత గ్రామసభలు నిర్వహించి మరికొంత మందిని తొలగించారు. గ్రామసభలో 27 వేల మందిని అర్హులుగా తేల్చారు. శాటిలైట్‌ చిత్రాలతో వారి వివరాలు పోల్చి చూస్తే అనేక మంది తిరస్కరణకు గురయ్యారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో 8,101 మంది అర్హులున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయించారు. జిల్లాల వారీగా అర్హుల సంఖ్య బాగా తక్కువగా ఉండటంతో దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించి, అర్హమైనవాటిని ఆమోదించాలని తాజాగా సూచనలు చేసినట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. మండల, గ్రామ కమిటీలు సాంకేతిక పరికరాలతో సర్వే చేసి, భూముల హద్దులు గుర్తించారు. సరైన ఆధారాలు చూపని, సాగులో లేని భూములను అందులో నుంచి తొలగించారు. తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హుల వివరాలను వెల్లడించడంతో మరి కొంత మంది తిరస్కరణకు గురయ్యారు. రైతులు సమర్పించిన దరఖాస్తులతో పాటు శాటిలైట్‌ చిత్రాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఆదేశాలతో అనేక మందిని జాబితాలో నుంచి తొలగించాల్సి వచ్చింది. సాగు చేస్తున్న భూముల సర్వే నెంబర్లను శాటిలైట్‌ చిత్రాలతో పోల్చి చూస్తే.. ఆయా ప్రాంతాల్లో పచ్చగా చెట్లు ఉన్నట్లు కనబడటంతో వారిని అనర్హులుగా గుర్తించారు.

కుమురం భీం జిల్లాలో ఎక్కువ  

జిల్లాల వారీగా పరిశీలిస్తే కుమురం భీం జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్న వారిలో 35 శాతం అర్హులున్నట్లుగా గుర్తించారు. తర్వాత ఆదిలాబాద్‌లో 30 శాతం, నిర్మల్‌లో 24, మంచిర్యాలలో 16 శాతం మంది ఉన్నట్లుగా గుర్తించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబరు 13 కంటే ముందు సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే సదరు భూమిపై హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టం చెబుతోంది. ఈ మేరకు అటవీ శాఖ 2005లో చేపట్టిన సర్వేలో భాగంగా రూపొందించిన గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా దరఖాస్తుదారుడు చూపిన భూమిలో ఎప్పటి నుంచి సాగు చేస్తున్నాడనేది గుర్తిస్తున్నారు. మ్యాప్‌ ప్రకారంగా గతంలో ఆ ప్రాంతంలో అడవి ఉంటే వారి దరఖాస్తులు తిరస్కరించారు. గిరిజనేతరుల సమస్య ఇంకా పరిష్కారం చేయలేదు. గిరిజనేతరులు పోడు హక్కు పత్రాలు పొందాలంటే మూడు తరాలకు సంబంధించి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. తొలి విడతలో గిరిజనులకు పోడు హక్కు పత్రాలు ఇచ్చేందుకు వీలుగా జిల్లా స్థాయిలో తిరస్కరించిన దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు