logo

సాయంత్రం మాట్లాడింది.. ఉదయం విగతజీవిగా మారింది..

నేను బాగానే ఉన్నానమ్మా.. నీవెలా ఉన్నావు.. ఇదిగో నా ఫొటో పంపిస్తున్నాను చూడంటూ సాయంత్రం కన్నతల్లికి చరవాణిలో మాట్లాడి స్వీయ చిత్రాన్ని పంపిన బిడ్డ తెల్లారేసరికి విగతజీవిగా మారిన ఘటన సారంగాపూర్‌ మండలం జామ్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలో చోటు చేసుకుంది.

Published : 04 Feb 2023 04:28 IST

ఆసుపత్రి వద్ద రోధిస్తున్న మహిత తల్లి, కుటుంబ సభ్యులు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే : నేను బాగానే ఉన్నానమ్మా.. నీవెలా ఉన్నావు.. ఇదిగో నా ఫొటో పంపిస్తున్నాను చూడంటూ సాయంత్రం కన్నతల్లికి చరవాణిలో మాట్లాడి స్వీయ చిత్రాన్ని పంపిన బిడ్డ తెల్లారేసరికి విగతజీవిగా మారిన ఘటన సారంగాపూర్‌ మండలం జామ్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలో చోటు చేసుకుంది. సోన్‌ మండలం పాక్‌పట్లకు చెందిన ఇప్ప మహిత(12) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. గతేడాది జూన్‌ 23న అయిదో తరగతిలో చేరిన మహిత అన్నింటిలోనూ చురుగ్గా ఉండేది. తోటి విద్యార్థులతో కలిసి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నిద్రలేచింది. అందరితో కలిసి యోగా సాధన చేస్తుండగా కాస్త నీరసంగా ఉందని, వీపులో నొప్పిగా ఉందని, ఎడమ చేయి లాగుతోందని తోటి విద్యార్థులతో చెప్పింది. ఏఎన్‌ఎంకు సమాచారం అందించడంతో నీరసంగా ఉందేమోనని ఆమె ఓఆర్‌ఎస్‌ తాగించారు. కాసేపటికే మహిత నేలపై పడిపోయింది. వెంటనే తోటి విద్యార్థినులు విద్యాలయంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి వేరేలా ఉండడంతో ప్రిన్సిపల్‌ రమాకల్యాణి, ఏఎన్‌ఎం ఉమారాణి ఉదయం 8.31 గంటలకు 108కు సమాచారం అందించి అక్కడే ఉన్న ఆటోలో నిర్మల్‌ ఆసుపత్రికి బయలు దేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లగానే 108 వారిని అందుకుంది. పైలెట్‌ సత్యంరెడ్డి, ఈఎంటీ ప్రభాకర్‌ ఆటోలో ఉన్న విద్యార్థిని వద్దకు వెళ్లి చూడగా ఆమెలో ఎలాంటి చలనం లేదు. అనుమానంతో సీపీఆర్‌ను అయిదు రౌండ్లు చేసినా ఎలాంటి స్పందన కనిపించలేదు. అప్పటికే బాలిక మృతి చెందిందని వారికి అర్థమైంది. చివరి నిర్ధరణ కోసం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లాక ఈసీజీ చేసి పరీక్షించిన వైద్యులు మహిత మృతి చెందినట్లు తెలిపారు. నిన్న సాయంత్రం వరకు బాగానే ఉన్న తన కూతురు ఎలా చనిపోయిందని బాలిక తల్లి సరిత, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తల్లి సరిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు. ఆర్‌సీవో మేరి ఏసుపాదం, నిర్మల్‌ జిల్లా వైద్యాధికారి వైద్యుడు ధన్‌రాజ్‌ జామ్‌ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. మహిత మృతికి కారణాలపై విచారణ జరిపారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా కాని, ప్రస్తుతం కాని ఎలాంటి రుగ్మతలు ఉన్నట్లు అనిపించలేదని, పోస్టుమార్టం నివేదికతోనే మృతికి కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

గురువారం తల్లికి వాట్సాప్‌లో పంపిన మహిత ఫొటో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని