logo

వానర సైన్యం.. జనం దైన్యం

జిల్లాలో వానరాల బెడదకు ప్రజలు, అన్నదాతలు కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇళ్లు, పంటలపై ప్రతాపం చూపుతున్నాయి.

Published : 05 Feb 2023 04:23 IST

బోథ్‌లోని కాలనీల్లో గుంపులుగా సంచరిస్తున్న కోతులు

న్యూస్‌టుడే, ఇచ్చోడ, తలమడుగు: జిల్లాలో వానరాల బెడదకు ప్రజలు, అన్నదాతలు కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇళ్లు, పంటలపై ప్రతాపం చూపుతున్నాయి. పిల్లలు, పెద్దలు వీటి భయానికి బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. గుంపులుగా వచ్చి చిందరవందర చేస్తున్నాయి. జనం వీటి బారిన పడి గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడ, అశోక్‌రోడ్డు, బ్రాహ్మణవాడతోపాటు పలు కాలనీల్లో, బోథ్‌, తలమడుగు, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, నేరడిగొండ, బేల, జైనథ్‌ మండలాల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. రెండేళ్లలో అన్ని మండలాల్లోని ఒక్కో ఆసుపత్రిలో పదుల సంఖ్యలో కోతుల దాడి చేసిన కేసులొచ్చాయి. గతేడాది తలమడుగులో కోతులను పట్టి నిర్మల్‌ అటవీప్రాంతం వైపు వదిలేసినా మళ్లీ వీటి బెడద తీవ్రమైంది.  


తలుపు తెరిస్తే అంతే..

తలుపులు తెరిచి ఉంటే వారి ఇల్లు గుల్ల అయినట్టే. ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట సామగ్రిని ఎత్తుకెళుతున్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. వాటి బాధ భరించలేక ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్థానికంగా సరైన చికిత్స అందక ఆదిలాబాద్‌లోని ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.


రైతులు పరేషాన్‌

గుంపులుగా తిరుగుతూ..

జిల్లాలో రబీలో శనగ, మొక్కజొన్న, జొన్న, గోధుమ, కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం శనగ పూత, కాత దశలో ఉండటంతో వానరాలు గుంపులుగా వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో 50 నుంచి 100కు పైగా ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలోని పంటలకు నష్టం వాటిల్లుతోంది.  


సమస్య పరిష్కారానికి కృషి

రాజశేఖర్‌, జిల్లా అటవీశాఖ అధికారి

జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కోతుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. గ్రామాల నుంచి కోతులను తరలించేందుకు ఆయా పంచాయతీల సర్పంచులతో మాట్లాడుతాం. పంచాయతీల్లో ఉన్న బడ్జెట్‌తో కోతులను పట్టించి నిర్మల్‌ ప్రాంతానికి తరలించేందుకు కృషి చేస్తాం.  


పంటలు కాపాడుకోవడం కష్టంగా మారింది

వెంకట్‌రావు, మన్నూర్‌

పదెకరాల్లో మొక్కజొన్న, గోధుమ పండిస్తున్నాను. గతంలో అడవి పందుల బెడద తీవ్రంగా ఉండేది. పంటను రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతుండగా.. కొత్తగా కోతుల బెడద అధికమైంది. పంటను రక్షించుకోవడం కష్టంగా మారింది. అధికారులు చొరవ చూపి ఇబ్బందులను తొలగించాలి. లేకుంటే భవిష్యత్తులో పంటల సాగు కష్టమైపోతుంది.


ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు ఎలుగు ఆశమ్మ. తలమడుగు గ్రామం. ఇటీవల ఇంటి ఆవరణలో కూర్చున్నారు. కోతులు గుంపులుగా వచ్చి మెడ భాగం, కాలిపై గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని