logo

నిధులు కేటాయించి.. మరింత భరోసా కల్పించి

పురపాలికల్లో వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించలేక రహదారుల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా మరింత చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.

Published : 05 Feb 2023 04:23 IST

బడ్జెట్‌లో వీధివ్యాపారుల అభ్యున్నతికి కేంద్రం పెద్దపీట

చెన్నూరు, న్యూస్‌టుడే: పురపాలికల్లో వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించలేక రహదారుల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా మరింత చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కొవిడ్‌ కారణంగా వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల కిందట కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో వ్యాపారుల బతుకులు ఆగమయ్యాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచి పీఎం స్వనిధి(ఆత్మనిర్భర్‌) పథకాన్ని ప్రారంభించి ఆర్థికంగా చేయూతనందించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో పట్టణాల్లో సర్వే నిర్వహించి అర్హులైన చిరు వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులనిచ్చింది. ఎంపిక చేసిన వారికి మొదటి, రెండు, మూడు విడతల్లో రుణసాయం అందించి ఆదుకుంది. గత రెండేళ్లలో వివిధ బ్యాంకుల ద్వారా దాదాపు రూ.50 కోట్ల మేర రుణాలిచ్చారు. ఈ సారి బడ్జెట్‌లో రూ.468 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు ఆర్థికంగా మరింత భరోసా కల్పించింది.

ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో 47,156 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వీరంతా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్ల వెంట వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఉపాధి మెరుగుపర్చేందుకు మొదట ఆత్మనిర్భర్‌ పథకంలో మొదటి విడతగా రూ.10 వేలు రుణంగా అందించారు. తిరిగి చెల్లించిన వారికి రెండో విడతగా రూ.20 వేలు అందజేశారు. అవి సక్రమంగా చెల్లించిన వారికి కేంద్రం రుణ పరిమితి పెంచి రూ.50 వేలు అందజేసింది. వీటితో రోడ్ల వెంట వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వీరి జీవన పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు కేంద్రం రుణ పరిమితిని పెంచడంతో పాటు నిధులు భారీగా కేటాయించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత వృద్ధిలోకి వస్తే ప్రభుత్వ ఆశయం నెరవేరనుంది.

చెన్నూరులోని ప్రధాన రహదారులపై రోడ్లవెంట తోపుడు బండ్లపై వ్యాపారాలు సాగిస్తున్న చిరు వ్యాపారులు


పెరగనున్న రుణ సాయం

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో రుణసాయం మరింతగా పెరిగే అవకాశముంది. రూ. 10 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగిన సాయం ఇప్పుడు రూ.లక్ష వరకు పెరిగే అవకాశముంది. వ్యాపార విస్తరణ పెరగడంతో పాటు ఆదాయం మరింత వృద్ధికానుంది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.


దుకాణాల ఏర్పాటుకు ఇబ్బందులు దూరం

కొవిడ్‌ సమయంలో నిర్మించిన కొన్ని దుకాణాలను వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. కేంద్రం ప్రకటించిన నిధులతో పురపాలికల్లో దుకాణాలు నిర్మించనున్నారు. నిధుల కేటాయింపుతో వ్యాపారులకు రోడ్ల వెంట ఏర్పాటు చేసుకున్న తోపుడు బండ్లు, రేకుల షెడ్లకు స్వస్తి పలికే అవకాశముంది.


సద్వినియోగం చేసుకోవాలి

- రాజు, మెప్మా జిల్లా సమన్వయకర్త, మంచిర్యాల

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సారి బడ్జెట్‌లో వీధి వ్యాపారులకు భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. అర్హులైన వ్యాపారులు రుణాలు అందించి వ్యాపార నిర్వహణకు సహకరిస్తాం. వ్యాపారులు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించి మరిన్ని ప్రోత్సహకాలు పొందాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని