logo

ఇందిరమ్మ స్థలాలకు ఎసరు!

ఖాళీ జాగా కనిపిస్తే భూ బకాసురులు వాలిపోతున్నారు. ఇప్పటికే నిర్మల్‌తోపాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని చెరువు శిఖం, అసైన్డ్‌ భూములు, సాగునీటి కాలువ కట్టలు చదును చేసి ఆక్రమించుకున్నారు.

Published : 19 Mar 2023 04:23 IST

సర్కారు భూమి కబ్జా చేస్తున్న వైనం..
నిర్మల్‌, న్యూస్‌టుడే

ఆక్రమణలో ఉన్న భూమి

ఖాళీ జాగా కనిపిస్తే భూ బకాసురులు వాలిపోతున్నారు. ఇప్పటికే నిర్మల్‌తోపాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని చెరువు శిఖం, అసైన్డ్‌ భూములు, సాగునీటి కాలువ కట్టలు చదును చేసి ఆక్రమించుకున్నారు. తాజాగా నిర్మల్‌ పట్టణం బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయ సమీపంలోని జంగల్‌ హనుమాన్‌ ఆలయం ఎదురుగా గతంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో ఇతర అవసరాలకు ఉంచిన ఖాళీ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. ఇదంతా సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం చూస్తుంటే ఈ భూ ఆక్రమణ వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 

నిర్మాణం మధ్యలోనే నిలిచిన ఫౌంటేన్‌

30 గుంటల భూమి స్వాహా..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అర్హులైన పేదలకు నిర్మల్‌ పట్టణ శివారులోని శాంతినగర్‌, బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ప్రాంతం, వైఎస్సాఆర్‌ నగర్‌లలో స్థలాలు సేకరించి, మూడు విడతలుగా దాదాపు 6వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందులో మహాలక్ష్మి ఆలయ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి సరిపోకపోవడంతో పక్కనే ఉన్న ఓ పట్టాదారుడి వద్ద దాదాపు రెండు ఎకరాల వరకు కొనుగోలు చేసింది. ఇందులో 30 గుంటల భూమి ఇతర అవసరాలకు (ఆలయ నిర్మాణం, పార్కు ఏర్పాటు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, తదితర వాటికి) వదిలేసి మిగతా దాంట్లో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే 15ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ భూమిపై కొంతమంది కన్నేసి గుట్టుచప్పుడు కాకుండా క్రమక్రమంగా మొరం నింపుతూ చదును చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ భూమి కబ్జా వెనుక అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలతోపాటు స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు ఉండటంతోనే అధికారులు మిన్నకుండిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని జంగల్‌ హనుమాన్‌ ఆలయానికి కేటాయించాలని కోరుతూ.. ఇటీవల బంగల్‌పేట్‌ శ్రీఆంజనేయ గణేశ్‌ మండలి యూత్‌, శ్రీజంగల్‌ హనుమాన్‌ ఆలయ కమిటీ సభ్యులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పాలనాధికారి వరుణ్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు.

వాకింగ్‌ ట్రాక్‌ దుస్థితి..

ఇళ్ల స్థలాలనూ..

పేదలకు కేటాయించిన ఇందిరమ్మ స్థలాల్లో కొంతమంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకొని జీవిస్తుండగా.. ఇంకొంత మంది పునాదుల వరకు నిర్మించుకుని వదిలేశారు. మరికొంతమంది ఆ స్థలాలను అలాగే వదిలేయడం ఆక్రమణదారులకు కలిసొచ్చింది. మొదట్లో ఈ స్థలాల చుట్టూ పునాదులు తవ్వి కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఎవరూ రాకపోయేసరికి.. నకిలీ పట్టా సృష్టించి అమాయకులకు అంటగడుతున్నారు. ఒక్కోప్లాటు (20్ఠ27) రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే బంగల్‌పేట్‌ మహాలక్ష్మి, శాంతినగర్‌, వైఎస్సాఆర్‌ నగర్‌లలో పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలను విక్రయించారు. ఇల్లు కట్టుకునే స్థోమత లేని పేద లబ్ధిదారులకు తమ ఇంటి స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో.. చేసేదేమీ లేక ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది అదే పనిగా ఇందిరమ్మ స్థలాలు ఆక్రమించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ దందాపై సమగ్ర విచారణ జరిపించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.  


అది ప్రభుత్వ భూమి

ప్రభాకర్‌, తహసీల్దార్‌, నిర్మల్‌ గ్రామీణం

బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయ సమీపంలోని జంగల్‌ హనుమాన్‌ ఆలయం ఎదురుగా ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించింది. గతంలో ఇందిరమ్మ స్థలాల కోసం ఒకరి నుంచి భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ఇతర అవసరాల కోసం కొంత ఖాళీగా వదిలిపెట్టారు. ఈ భూమి ఆక్రమణకు గురవుతోందని ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టాం. అది ప్రభుత్వ భూమి అని తేలింది. దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాం. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు