logo

మోగిన చప్పట్లు.. నిధులు రాక ఇక్కట్లు

అది 2018 ఫిబ్రవరి 27వ తేదీ.. ఆదిలాబాద్‌ పట్టణంలో డైట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు.

Published : 31 Mar 2023 05:50 IST

బల్దియాకు సీఎం ప్రకటించిన రూ.25 కోట్లకోసం అయిదేళ్లుగా ఎదురుచూపులు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

అది 2018 ఫిబ్రవరి 27వ తేదీ.. ఆదిలాబాద్‌ పట్టణంలో డైట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. నాటి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు బల్దియా అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సభ అంతా చప్పట్లతో మార్మోగింది. తదనంతరం ముఖ్యమంత్రి హామీ (సీఎం అష్యూరెన్స్‌) పథకం కింద జీఓ.ఆర్‌టీ.నెం.599 పేరిట అదే ఏడాది జులై 28న ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. పనులు చేపట్టొచ్చని పరిపాలన అనుమతులు సైతం వచ్చాయి. ప్రతిపాదిత పనులలో కొన్ని పూర్తికాగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అయిదేళ్లు గడిచాయి. ఏటా ఎదురుచూపులే తప్ప ఇప్పటిదాకా నిధులు విడుదల కాలేదు.

58 పనులకు ప్రతిపాదనలు

ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.25 కోట్ల నిధులకు సంబంధించి అప్పటి పాలకవర్గం 58 పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసింది. సీసీ, బీటీ రోడ్లు, మురుగు కాలువలు, వంతెనలు, ఆడిటోరియం నిర్మాణం, పార్కుల అభివృద్ధి, వైకుంఠధామాల అభివృద్ధి, ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వసతుల ఏర్పాటు, చెత్తను తరలించేందుకు వాహనాల కొనుగోలు తదితర పనులను గుర్తించారు. కొన్ని పనులకు అప్పట్లోనే కొబ్బరికాయలు కొట్టేశారు. తర్వాత శాసనసభ సాధారణ ఎన్నికలు రాగా మళ్లీ భారాస పార్టీనే అధికారంలోకి వచ్చింది. బల్దియాకు సైతం ఎన్నికలు రావడంతో జోగు ప్రేమేందర్‌ అధ్యక్షతన కొత్త పాలకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి పట్టణంలో ఆ పథకం కింద పనులు కొనసాగుతూ వస్తున్నాయి. మొత్తం 58 పనుల్లో ఇప్పటిదాకా 32 పనులు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.

భారంగా మారిన బిల్లుల చెల్లింపు

ముఖ్యమంత్రి హామీ నిధులు విడుదల కాకపోయినా ప్రతిపాదిత పనులలో వైకుంఠధామాలు, పార్కులు, పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన కొన్ని పనులను పట్టణ ప్రగతి నిధులతో చేపట్టుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకవేళ సీఎంఏ నిధులు విడుదలైతే పట్టణ ప్రగతి నిధుల కింద జమ చేసుకుని ఇతరత్రా పనులు చేసుకునేందుకు అనుమతిచ్చింది. మూడేళ్లుగా సీఎంఏ నిధులు రూ.25 కోట్లు వస్తాయని బల్దియా వార్షిక అంచనా బడ్జెట్‌లో రూ.25 కోట్లు చూపుతూ వచ్చారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో ఆ నిధులను పొందుపర్చలేదు. ఒకవేళ నిధులు విడుదలైతే మళ్లీ బడ్జెట్‌ను సవరించుకోవచ్చనే ఉద్దేశంతో బల్దియా యంత్రాంగం ఉంది. అయితే సీఎంఏ నిధులు రూ.25 కోట్లలో దాదాపు రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేక పాలకవర్గం సంకట స్థితిని ఎదుర్కొంటోంది.


నిధులు రావాల్సి ఉంది
తిరుపతి, డీఈఈ, బల్దియా

సీఎం అష్యూరెన్స్‌ కింద 32 పనులు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశలలో ఉన్నాయి. నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతితో ప్రతిపాదిత పనులలో కొన్నింటిని పట్టణ ప్రగతి నిధులతో పూర్తి చేశాం. పాలకవర్గం ఆదేశాలతో సీఎం అష్యూరెన్స్‌ నిధుల విడుదలకు సంబంధించి వచ్చే నెలలో కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీడీఎంఏ)కు పూర్తి వివరాలను సమర్పిస్తాం.
గాంధీనగర్‌, రణదివెనగర్‌ కాలనీలను కలుపుతూ వంతెనను నిర్మించాలని 2018లోనే ప్రతిపాదించారు. సీఎం అష్యూరెన్స్‌ కింద రూ.1.40 కోట్లతో నిధులతో నిర్మాణం చేపట్టగా గతేడాది పూర్తయింది. నిధులు మాత్రం ఇప్పటిదాకా విడుదల కాలేదు.
పట్టణంలో రూ.5 కోట్ల సీఎంఏ నిధులతో ఆడిటోరియం నిర్మించాలని అప్పట్లోనే నిర్ణయించారు. మొదట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించాలనుకున్నా అభ్యంతరం వ్యక్తం కావడంతో కైలాస్‌నగర్‌కు మార్చారు. ఇటీవల టెండరు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన రాకపోగా మరోసారి టెండరు పిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు