logo

నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు

ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్‌ తెలిపారు.

Updated : 31 Mar 2023 06:40 IST

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే

ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్‌ తెలిపారు. గతేడాది ఫలితాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన జిల్లాను ఈ సారి గౌరవ ప్రదమైన స్థానంలో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరో మూడురోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఈఓతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలిలా ఉన్నాయి..
న్యూస్‌టుడే: ఈ సారి పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు ఏమిటి?
డీఈఓ: ఈసారి ఆరు పేపర్ల విధానంలో పరీక్షలు ఉంటాయి. సైన్సు పేపర్లు ఒకే రోజు రెండు నిర్వహిస్తారు. ఇంగ్లీషు పేపరు రోజు ప్రశ్నపత్రంలో పార్ట్‌(ఏ), పార్ట్‌(బీ)లు ఒకేసారి ఇవ్వనున్నారు. సైన్సు పేపర్లకు చివరి 15 నిమిషాల ముందు, మిగతా విషయాలకు చివరి అరగంట ముందు పార్ట్‌(బి) ఇస్తారు. ఈ విధానంపై విద్యార్థులకు అవగాహన రావడానికి ఇప్పటికే రెండు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాం.
న్యూ: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?
డీఈఓ: ఈసారి జిల్లాలోని 6670 మంది రెగ్యులర్‌, 471 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్ష రాసేందుకు 36 రెగ్యులర్‌ కేంద్రాలను, 3 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశాం. 415 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. వేసవి కాలం అయినందునవల్ల ఈ కేంద్రాల్లో తాగునీటి వసతి, నిరంతర విద్యుత్తు, వైద్య పరమైన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
న్యూ: హాల్‌టిక్కెట్ల అందజేత, సందేహాల నివృత్తి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఈవో: విద్యార్థులకు హాల్‌ టికెట్టు ఇచ్చే ముందు సంబంధిత ప్రధానోపాధ్యాయులు హాల్‌ టిక్కెట్లలోని ఫొటోలు, వివరాలను పాఠశాల రికార్డుతో సరి చూసుకోవాలి. హాల్‌ టిక్కెట్ల పంపిణీ విషయంలో ప్రధానోపాధ్యాయుల నుంచి ఇబ్బంది ఎదురైతే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిపై ప్రధానోపాధ్యాయుల సంతకం అవసరం లేదు. పరీక్షల విషయంలో ఫిర్యాదులు, సందేహాల సంప్రదింపుల కోసం డీఈఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాం. విద్యార్థులు చరవాణి సంఖ్య 94415 40927 సంప్రదించవచ్చు.
న్యూ: చూచిరాతలు నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు?
డీఈఓ: అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. జవాబు పత్రాల ప్యాకింగ్‌, మెటీరియల్‌ను పోస్టాఫీసుకు పంపించే వరకు రికార్డు అవుతూ ఉంటాయి. సీఎస్‌, డీవోలు, ఇన్విజిలేటర్లు, ఇతర పరీక్ష సిబ్బంది, వైద్య సిబ్బందితోపాటు ఎవరూ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకురాకుండా నిషేధించాం. సంబంధిత అధికారుల ఫోన్‌ నంబర్లును బోర్డుపై ప్రదర్శిస్తాం. ప్రతి కేంద్రం వద్ద సిట్టింగ్‌ స్క్వాడ్లు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించాం.
న్యూ: గ్రామీణ, దూర ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ఎలాంటి రవాణా సదుపాయం కల్పించనున్నారు?
డీఈవో: పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాం. విద్యార్థులకు అవసరమైన రూట్లలో బస్సులు నడుపుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని