logo

పసికందుకు లేజర్‌ శస్త్ర చికిత్స

నిర్మల్‌ జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో గురువారం 35 రోజుల మగ శిశువుకు అరుదైన లేజర్‌ కంటి శస్త్ర చికిత్స చేశారు.

Updated : 26 May 2023 05:44 IST

హైదరాబాద్‌ ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్య బృందం ఘనత
ఉత్తర తెలంగాణలో రెండోది  

శిశువుకు చికిత్స చేసిన ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్య   నిపుణుడు డా.సుమంత్‌ వినాయక్‌శర్మ, వైద్య బృందం

నిర్మల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో గురువారం 35 రోజుల మగ శిశువుకు అరుదైన లేజర్‌ కంటి శస్త్ర చికిత్స చేశారు. సారంగాపూర్‌ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన నాగమణి ఏడు నెలల్లోనే సాధారణ ప్రసవంతో మగ శిశువుకు జన్మినిచ్చింది. శిశువు కేవలం 1100 గ్రాములే ఉన్నాడు. 15 రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ పసికందుకు 30 రోజుల్లోనే మెరుగైన చికిత్స అందించకుంటే శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదముంది. ఈ విషయాన్ని జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.దేవేందర్‌రెడ్డి, ప్రసూతి ఆసుపత్రి బాధ్యురాలు డా.రజనిల దృష్టికి ఎస్‌ఎన్‌సీయూ వైద్యులు తీసుకెళ్లారు. చూపునకు ప్రమాదం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని వారు సూచించడంతో నేత్ర వైద్యనిపుణులు శుశ్రుత్‌కుమార్‌, రవీనాలు ఆర్‌వోపీ(సంపూర్ణ రెటీనా పరీక్ష) నిర్వహించారు. చిన్నారికి కంటి చూపునకు ప్రమాదముందని, నివారణ చర్యలకు హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యులను సంప్రదించడంతో ప్రత్యేక శ్రద్ధతీసుకొని అక్కడి నేత్ర వైద్య నిపుణుడు డా.సుమంత్‌ వినయ్‌శర్మ తన బృందం సభ్యులు సాయికిరణ్‌, కిషన్‌లతో నిర్మల్‌ చేరుకున్నారు. శస్త్ర చికిత్సకు అవసరమైన పరికరాలతో వచ్చి గంట సమయం వెచ్చించి శిశువుకు లేజర్‌ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఉచితంగా రూ.27 వేల విలువ కలిగిన అవాస్టిన్‌ సూది మందును చిన్నారికి ఇచ్చారు. శస్త్ర చికిత్స పూర్తయి, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. చికిత్సకు నేత్ర వైద్యులు సుకేష్‌, ఆర్‌ఎంవో వేణుగోపాలకృష్ణ, ఎస్‌ఎన్‌సీయూ విభాగం కిరణ్మయి, హెడ్‌నర్సు రాంబాయమ్మ, నర్సులు శ్రుతి, మనీష సహకరించారు. ఈ సందర్భంగా డా. సుమంత్‌ను డా.రజని సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని