logo

ఏసీ బస్సుల్లో ఉక్కపోత!

మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఏసీ బస్సులకు సరైన మరమ్మతులు, నిర్వహణ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 26 May 2023 05:44 IST

ఆర్టీసీపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

మంచిర్యాలఅర్బన్‌, న్యూస్‌టుడే: మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఏసీ బస్సులకు సరైన మరమ్మతులు, నిర్వహణ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం భానుడు భగభగ మండటంతో డబ్బులు ఖర్చయినా ఫర్వాలేదు ప్రయాణం చల్లగా సాగిపోవాలని ఏసీ బస్సుల్లో ఎక్కుతున్నారు. అయితే బస్సుల నిర్వహణ లోపం కారణంగా చల్లగాలి తగినంత రాకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు రైల్వే ప్రయాణం ద్వారా సౌలభ్యం ఉన్నప్పటికీ తమకు తగిన సమయంలో బస్సులు ఉన్నాయని ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. కానీ అందులో సౌకర్యాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* మంచిర్యాల ఆర్టీసీ డిపో పరిధిలో నిత్యం మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు 7  ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏసీ రాజధానిలో మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు రూ. 640 ఛార్జీ వసూలు చేస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని సెస్‌ పేరుతో అదనపు వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించే వారికి వాటర్‌బాటిల్‌, ఏసీ ఎక్కువగా ఉన్నప్పుడు కప్పుకోవడానికి ఓ బెడ్‌షీట్‌ ఇవ్వాలి. వినోదం కోసం టీవీలు ఏర్పాటు చేయాలి. ఇందులో ఎలాంటి అసౌకర్యాలు కలిగినా వెంటనే స్పందించాలి. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారి ప్రయాణికులు అధికం. డిమాండ్‌కు తగినన్ని ఏసీ బస్సులు లేకపోవడంతో చాలా మంది రైల్వే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మిగిలిన వారిలో మరికొంత మంది ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఏసీ బస్సుల సంఖ్య మరిన్ని పెంచితే సంస్థకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు సౌలభ్యం కలగనుంది.

ఇబ్బందులు ఇలా..

* వెనక వైపు కూర్చున్న వారికి ఏసీ రావడం లేదు.

* చాలా వాటిలో చరవాణి ఛార్జింగ్‌ పెట్టుకునే పిన్‌ పనిచేయడం లేదు.

* మంచినీటి సీసా డ్రైవర్‌ వద్ద ఉంటుంది. అవసరం ఉన్న వారే తెచ్చుకోవాలి. అడగని వారుంటే ఇక అంతే. అవి ప్రయాణికులకు ఇచ్చే వారు కూడా లేరు.

* ఉష్ణోగ్రతల వేడికి ఏసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. మధ్యాహ్న సమయం ప్రయాణంలో ఏసీ ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.

టీవీలు నామమాత్రం

వినోదం కోసం ఏర్పాటు చేసిన టీవీలు మూగబోయాయి. చక్కటి వినోదం,  ఆహ్లాదం అందిస్తామని ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్న గుత్తేదారులు నెలవారీగా వచ్చే కాసులపై చూపించే శ్రద్ధ ప్రయాణికుల సౌకర్యాలపై చూపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని