logo

దశాబ్ది వేడుకలపై ప్రత్యేక సమీక్ష

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఏ లోటు కనిపించకుండా పండగ వాతావారణంలో నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కార్యక్రమ పర్యవేక్షకులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ.శ్రీధర్‌ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 04:05 IST

సమీక్ష నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, చిత్రంలో పాలనాధికారి రాహుల్‌రాజ్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఏ లోటు కనిపించకుండా పండగ వాతావారణంలో నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కార్యక్రమ పర్యవేక్షకులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ.శ్రీధర్‌ పేర్కొన్నారు. గురువారం ఉదయమే జిల్లాకు చేరుకున్న ఆయన కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి రాహుల్‌రాజ్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. రోజూవారీగా ఏర్పాట్లపై ఆరాతీశారు. ముఖ్యంగా రైతు దినోత్సవాన రైతు వేదికల వద్ద సందడి కనిపించాలన్నారు. రైతు వేదికల వద్ద ఏర్పాట్లు బాగా చేయాలని, భోజన వసతి దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించే వారుంటే ముందుగానే పసిగట్టి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సాయంత్రం వేళ చెరువు గట్లపై జరిగే కార్యక్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం తాగి వచ్చేవారు ఉంటారని గుర్తుచేశారు. పాలనాధికారి రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ ఉత్సవాల కోసం కార్యక్రమాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అధికారులతోనూ పాలనాధికారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తగు సూచనలు చేశారు. అదనపు పాలనాధికారి నటరాజ్‌, శిక్షణ కలెక్టర్‌ శ్రీజ, ఏఎస్పీ శ్రీనివాస్‌రావు, అటవీ అధికారి రాజశేఖర్‌, ఆర్డీవో రమేష్‌ రాఠోడ్‌, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

సర్వం సిద్ధం

పాలనాప్రాంగణం: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కలెక్టరేట్ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఏర్పాట్లను పాలనాధికారి రాహుల్‌రాజ్‌ గురువారం పర్యవేక్షించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జెండా ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడే ప్రసంగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. తొలుత ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు, తెలంగాణచౌక్‌లోని ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేయనున్నట్లు పాలనాధికారి వివరించారు. ఆయన వెంట ఆర్డీవో రమేష్‌ రాఠోడ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ సతీష్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని