logo

క్రీడా మైదానం.. నాణ్యత నామమాత్రం

క్రీడా మైదానాల పనులు నత్తనడకన, అధ్వానంగా సాగుతున్నాయి. స్థానిక పంట చేల నుంచి నల్ల మట్టిని తెచ్చి చదును చేసే పనులు చేస్తుండగా.. కొంత మేర అక్కడే తవ్వి అదే మట్టిని వేసి మైదానం పనులను మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు.

Published : 03 Jun 2023 02:15 IST

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

మైదానం పక్కన కాల్వ ఉండగా..  మండు వేసవిలోనే నీరు మైదానం చివరి భాగంలో వచ్చిన తీరిది

క్రీడా మైదానాల పనులు నత్తనడకన, అధ్వానంగా సాగుతున్నాయి. స్థానిక పంట చేల నుంచి నల్ల మట్టిని తెచ్చి చదును చేసే పనులు చేస్తుండగా.. కొంత మేర అక్కడే తవ్వి అదే మట్టిని వేసి మైదానం పనులను మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు. నిర్ణీత కొలతల మేరకు కంకర వాడాల్సి ఉండగా భవనాన్ని కూలగొట్టిన శిథిలాలను ఇందుకు వినియోగించారు. మొరం బదులుగా మైదానం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల నుంచి మట్టిని, గోడల నిర్మాణాలకు వాగుల్లో దొరికే నల్లని ఇసుక ఉపయోగిస్తున్నారు. గిరిజన ఉద్యానవనానికి చెందిన 20 ఎకరాల స్థలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు రూ.1.25 కోట్లు, అథ్లెటిక్‌ ట్రాక్‌కు మరో రూ.24 లక్షల నిధులు మంజూరై ఏడాది దాటిపోయింది. క్రీడా పాఠశాలకు అవసరమైన మైదాన పనులకు మూడేళ్ల క్రితం రూ.55 లక్షలు మంజూరయ్యాయి. ఈ రెండిట్లో ఏదీ నేటికీ పూర్తి కాలేదు. కేవలం మట్టి తెచ్చి చదును చేసే పనులు మాత్రమే చేస్తున్నారు. క్రీడా పాఠశాల తరగతులు ప్రారంభమై మూడేళ్లు దాటుతుండగా ఇందులో 120 మంది పిల్లలు చదువుకుంటున్నారు. మరో పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సంవత్సరం సైతం విద్యార్థులు ఆటలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులే ఉన్నాయి.

వేసవిలో వస్తున్న నీరు

క్రీడా పాఠశాలకు రహదారి వైపు కాల్వ ఉంది. వర్షాకాలం వరద నీటితో ఇది పోటెత్తుతుంది. ఈ వేసవిలోనే నీళ్లు నేరుగా మైదానంలోకి వస్తున్నాయి. ఇక వర్షాకాలం పూర్తిగా మైదానం చెరువులా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ గోడ కట్టడానికి రూ.22 లక్షలు వచ్చినా అందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ఇక వర్షాకాలం ఇబ్బందులు తప్పవని విద్యార్థులు అంటున్నారు. రన్నింగ్‌ ట్రాక్‌, ఖోఖో, హ్యాండ్‌బాల్‌, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్‌, హైజంప్‌ కోర్టు, వాలీబాల్‌, షటిల్‌కోర్టులతోపాటు, సింథటిక్‌ ట్రాక్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టుల పనుల ఊసే లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు