logo

కృత్రిమ కొరత.. అన్నదాతకు వెత

జైనథ్‌కు చెందిన భగవాండ్లు అనే రైతుకు నాలుగెకరాల చెలక భూమి ఉంది. నేల స్వభావ రీత్యా ఎర్లీ వెరైటీ (స్వల్పకాలికమైన) విత్తనం వేస్తే మంచిదనే ఆలోచనతో ఆదిలాబాద్‌లోని ఓ ప్రముఖ విత్తన దుకాణంలో 659 రకం విత్తనాల కోసం రాగా స్టాక్‌ లేదని పంపించారు

Published : 03 Jun 2023 02:32 IST

విత్తన వ్యాపారుల మాయాజాలం..

ప్రేక్షక పాత్రలో యంత్రాంగం

ఆదిలాబాద్‌లో దుకాణాల దగ్గర రైతుల పడిగాపులు

ఈటీవీ - ఆదిలాబాద్‌: జైనథ్‌కు చెందిన భగవాండ్లు అనే రైతుకు నాలుగెకరాల చెలక భూమి ఉంది. నేల స్వభావ రీత్యా ఎర్లీ వెరైటీ (స్వల్పకాలికమైన) విత్తనం వేస్తే మంచిదనే ఆలోచనతో ఆదిలాబాద్‌లోని ఓ ప్రముఖ విత్తన దుకాణంలో 659 రకం విత్తనాల కోసం రాగా స్టాక్‌ లేదని పంపించారు. తెలిసిన మరో వ్యక్తితో ఓ ప్రముఖ దుకాణానికి వెళ్లగా రెండు 797 రకం విత్తన సంచులు తీసుకుంటే రెండు 659 విత్తన సంచులు ఇచ్చాడు. అవసరం లేని 797 రకం విత్తన సంచులను తీసుకోకుంటే అడిగిన విత్తనాలు లేవని డీలర్లు చేతులెత్తేశారు. ఇలా ఒక్క దుకాణంలోనే కాదు. ఆదిలాబాద్‌ సహా ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బేల, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌ ప్రాంతాల్లో 659 రకం విత్తనాల కోసం డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు ఉమ్మడి జిల్లాలో ప్రముఖ డీలర్లు, కొంతమంది ప్రముఖ దుకాణదారులు పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలను తెచ్చి అమాయక అన్నదాతలకు అంటగట్టే దందా సాగుతోంది. ఇది చాలదన్నట్లు రైతులు కావాల్సిన విత్తనాల పంపిణీలో కృత్రిమ కొరత సృష్టించి కోట్లు సంపాదించాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో 9.20 లక్షల ఎకరాలు పత్తి ప్రధాన పంట. పాపులేషన్‌ పద్ధతి(వరుసగా వేయడం)లో ఎకరాకు నాలుగు విత్తన సంచులు అవసరం. అదే అడుగుల పద్ధతిలో వేస్తే ఎకరాకు రెండు విత్తన సంచలు అవసరం. పాపులేషన్‌ ప్రకారమైతే 16.50 లక్షల ఎకరాలకు నాలుగు సంచుల చొప్పున 66 లక్షల విత్తన సంచులు/ అడుగుల పద్ధతిలో 33 లక్షల సంచులు అవసరం. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లో పత్తి విత్తనాల కోసం మే చివరి వారం నుంచి రైతులు వేచి చూస్తారనే విషయం అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి చీకటి వ్యాపారంలో కోట్లు గడించడానికి మార్గం సుగమమవుతోంది.


అడిగినవి ఇవ్వడం లేదు
గౌరు శ్రీధర్‌ రైతు, భీంసరి

ఆదిలాబాద్‌లోని అన్ని దుకాణాలకు వెళ్లా. వేరే రెండు సంచులను కొనుగోలు చేస్తేనే 659 రకం విత్తనాలు రెండు సంచులు ఇస్తున్నారు. వేరేవి అవసరం లేదంటే స్టాక్‌ లేదంటున్నారు. రైతులు డబ్బులు చెల్లించినా అడిగిన విత్తనాలే ఇవ్వడం లేదంటే ప్రభుత్వం చెప్పే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అర్థమేముంటుంది. కృత్రిమ కొరత సృష్టించే డీలర్ల వివరాలు అధికారులకు తెలియని అంశం కాదు.


ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా 475 గ్రాముల విత్తనాల సంచికి ఎంఆర్‌పీ రూ.853 ధర ఉంది. వాస్తవంగా దానికంటే తక్కువగా డీలర్‌కు వస్తుంది. ఓ 20 శాతం లాభంతో రైతులకు విక్రయిస్తారు. రైతుల డిమాండ్‌ ప్రకారం 659 రకం విత్తనాల కంటే ఇతర విత్తనాలు విక్రయిస్తే లాభం ఎక్కువగా ఉంటుంది. తయారు చేసే కంపెనీకి పెట్టుబడి, ఖర్చు తక్కువగా ఉంటుంది. అందుకే 659 విత్తనాలు కావాలంటే డీలర్లు సూచించినట్లు ఇతర విత్తనాలు తీసుకోవాలనే అనధికారిక నిబంధన విధిస్తున్నారు.  పోనీలే ఏ విత్తనాలైన ఒకటే అనుకోవడానికి వీల్లేదు. గత సంవత్సరం విక్రాంత్‌ కంపెనీ విత్తనాలు మొలకెత్తలేదు. ఆ తరువాత అవి నకిలీవి అని తేలడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకోవడంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు కంపెనీ ముందుకొచ్చింది. ఇప్పుడు 659 రకం విత్తనాలతో అంటగట్టే విత్తనాల నాణ్యత ఎలా ఉంటుందనే భయం రైతులను వెంటాడుతోంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని