logo

బాల సదనానికి మరో ముగ్గురు బాలికలు

తల్లి మృతి చెందగా, తండ్రి జైలుకు వెళ్లటంతో అనాథలుగా మారిన ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఐసీడీఎస్‌ అధికారులు శుక్రవారం బాల సదనానికి తరలించి ఆశ్రయం కల్పించారు.

Published : 03 Jun 2023 02:38 IST

ఎదులాపురం, న్యూస్‌టుడే : తల్లి మృతి చెందగా, తండ్రి జైలుకు వెళ్లటంతో అనాథలుగా మారిన ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఐసీడీఎస్‌ అధికారులు శుక్రవారం బాల సదనానికి తరలించి ఆశ్రయం కల్పించారు. పట్టణంలోని బంగారుగూడకు చెందిన రాధ 11 నెలల కిందట కవల ఆడ శిశువులకు జన్మనిచ్చిన అనంతరం మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉండటంతో వారిని పోషించే ఆర్థిక స్థోమత లేకపోవటంతో ఈ కవల శిశువులను తండ్రి గంగాధర్‌ మధ్య వర్తులతో కలిసి కవల శిశువులను కర్ణాటకలోని రెండు కుటుంబాలకు విక్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి కవలల తండ్రి గంగాధర్‌తో పాటు నిందితులను రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆ కవల శిశువులను ఇది వరకే శిశు గృహకు తరలించి ఆశ్రయం కల్పించారు. దీంతో అప్పటికే ఉన్న 10, 08, 06 సంవత్సరాల బాలికలు అనాథలుగా మారారు. వారు బంధువుల వద్ద దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు ఆ ముగ్గురు పిల్లలను బాల సదనానికి తరలించి ఆశ్రయం కల్పించారు. అయితే వారు బాల సదనంలో ఉండటానికి ఇష్టపడటం లేదని ఐసీడీఎస్‌ ఇన్‌ఛార్జి పీడీ మిల్కా పేర్కొన్నారు. పెద్ద అమ్మాయి ఏ మాత్రం అక్కడ ఉండకుండా మారాం చేయటంతో ఆమెను బంధువులతో పంపించినట్లు పేర్కొన్నారు. మిగతా ఇద్దరికి నచ్చజెప్పి బాల సదనంలోనే ఉంచామన్నారు. పాఠశాలలు తెరిచాక వారిని వసతి గృహాల్లో చేర్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని