logo

అరుదైన వృక్ష శిలాజాలకు రక్షణ కరవు!

అడవుల జిల్లా కుమురంభీంలో ప్రకృతి సంపద, సహజవనరులకు ఆలవాలం. అపార ఖనిజాలతోపాటు జలపాతాలు, గోదావరి తీరం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Updated : 22 Sep 2023 06:11 IST

కొండపల్లి అడవుల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో ఫాసిల్‌వుడ్‌

కొండపల్లి అడవిలో వృక్ష శిలాజాలు

బెజ్జూరు, న్యూస్‌టుడే: అడవుల జిల్లా కుమురంభీంలో ప్రకృతి సంపద, సహజవనరులకు ఆలవాలం. అపార ఖనిజాలతోపాటు జలపాతాలు, గోదావరి తీరం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీటికితోడు ఇక్కడ అరుదైన వృక్షశిలాజాలు మారుమూల మండలమైన పెంచికల్‌పేట్‌లోని కొండపల్లి అడవుల్లో పదేళ్ల కిందట వెలుగులోకి వచ్చాయి. వీటి రక్షణ కోసం అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపినా.. నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో వాటి రక్షణ చర్యలు కనుమరుగయ్యాయి.

పెంచికల్‌పేట్‌ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ విస్తారంగా ఉన్న వృక్షశిలాజాల జాడను 2013లో అటవీ అధికారులు గుర్తించారు. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కంటే పూర్వం నాటివిగా భావిస్తున్నారు. కొండపల్లి గ్రామానికి నాలుగు కి.మీ. దూరంలో అన్వేషిస్తే 20ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల వృక్షశిలాజాలు బయటపడ్డాయి. కొన్ని తొమ్మిది నుంచి 25 అడుగుల పొడవు ఉన్నాయి. మరికొన్ని 50అడుగులు ఉండి ముక్కలైనట్లు కనిపిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా కునిఫెర జాతికి చెందినవని అటవీ అధికారులు భావించారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లయితే మరికొన్ని బయటపడతాయని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన రేంజ్‌ అధికారి అప్పయ్య.. సిబ్బందితో గస్తీ తిరుగుతుండగా శిలాజాలు కనిపించాయి. అప్పట్లోనే భూగర్భ గనులశాఖ అధికారులకు సమాచారమివ్వగా.. 2015లో పలుమార్లు సర్వేలు చేశారు. అదే ఏడు తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు వేముగంటి మురళీ, హరగోపాల్‌, ప్రభాకర్‌, భూమన్నలు కొండపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. వృక్ష శిలాజాలను పరిశీలించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.

ముక్కలైన వృక్ష శిలాజాలు

వయసు అంచనాలు ఇలా..

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని గడ్చిరోలికి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత-గోదావరి బేసిన్‌లో వడదాంలో సారోఫోడ్స్‌ సరీసృపాల జాడలు గతంలో వెలుగుచూసిన విషయం తెల్సిందే. వాటి శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. వృక్షశిలాజాలు అక్కడే లభ్యమయ్యాయి. ఆరున్నర కోట్ల ఏళ్లకు పైగా చెందినవిగా జియాలాజికల్‌ ఆఫ్‌ ఇండియా సర్వే ద్వారా గుర్తించారు. ఆ తర్వాత  ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వడదాం ఫాసిల్‌ పార్కుగా మార్చింది. అయితే కొండపల్లి అటవీ ప్రాంతానికి చేరువుగా ఉండటంతో ఇక్కడి వృక్షశిలాజాల వయసూ అంతే ఉందని అంచనా వేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో శివాలిక్‌ ఫాసిల్‌ పార్క్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సల్కాన్‌ ఫాసిల్‌ పార్క్‌, గుజరాత్‌లోని ఇంద్రోడ తరహాలో కొండపల్లిలోని వృక్షశిలాజాలు ఉన్న ప్రాంతానికి రక్షించేందుకు దాన్ని ఫాసిల్‌ పార్క్‌గా గుర్తించాలని నిపుణులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే రాక్షస బల్లుల శిలాజాల జాడలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. శిలాజాలు ఉన్న ప్రాంతాన్ని కంచెలు ఏర్పాటు చేసి పార్క్‌గా గుర్తిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలోనే వేమనపల్లి అటవీ ప్రాంతంలో రాక్షస బల్లి శిలాజం లభ్యం కాగా.. హైదరాబాద్‌ బిర్లా సైన్స్‌ సెంటర్లలో ప్రదర్శనకు పెట్టిన విషయం తెల్సిందే.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
- ప్రభాకర్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి, పెంచికల్‌పేట్‌

ఉమ్మడి బెజ్జూరు మండలంలో కొండపల్లి ఉన్నప్పుడు వృక్ష శిలాజాలపై అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ విషయంలో మళ్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి రక్షణ చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని