logo

మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడి

పార్కింగు విషయంలో తలెత్తిన స్వల్ప వివాదం ఒకరి మృతికి కారణమైంది. ఇంటి సమీపంలో వాహనం పెట్టొద్దని అన్నందుకు ఓ వ్యక్తి మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 04 Oct 2022 03:28 IST

ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు


మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పార్కింగు విషయంలో తలెత్తిన స్వల్ప వివాదం ఒకరి మృతికి కారణమైంది. ఇంటి సమీపంలో వాహనం పెట్టొద్దని అన్నందుకు ఓ వ్యక్తి మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విశాఖ నగర పరిధి కైలాసపురంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా...కైలాసపురం సమీప లక్ష్మినారాయణపురానికి చెందిన నాగబోయిన నారాయణరావు(75) ఉదయం సుమారు 8.30 గంటలకు ఇంటి మేడపై దినపత్రిక చదువుకుంటున్నారు. వీరి ఇంటి ఎదురు రోడ్డులో ఇతని రెండో కొడుకు గోపికి చెందిన టాటా ఏసీ ఆటో, దాని వెనుక అదే ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్‌(38) ద్విచక్రవాహనం ఉన్నాయి. గోపి ఆటో తీస్తుండగా అక్కడున్న దుర్గాప్రసాద్‌ పార్కింగ్‌ విషయమై దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగాడు. కుటుంబసభ్యులు గోపిని ఇంటిలోకి తీసుకెళ్తున్న సమయంలో ఇదంతా గమనిస్తున్న తండ్రి నారాయణరావు మేడపై నుంచి కిందికి వచ్చి ‘నా కొడుకుపై తిరగబడతావా’ అని గట్టిగా నిలదీశారు. పూటుగా మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్‌ తొలుత ఆయన చెంపపై తర్వాత విచక్షణారహితంగా గుండెపై పిడిగుద్దులు కురిపించడంతో కుప్పకూలిపోయారు. స్థానికుల సమాచారం మేరకు చేరుకున్న 108 వాహన వైద్య సిబ్బంది పరిశీలించి అప్పటికే ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏసీపీ హర్షిత పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని