logo

ఏది కావాలన్నా ఇంటికే.. నూనె.. సబ్బులు లేవు!

బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతిగృహాలు కాస్తా సం‘క్షామ’ గృహాలుగా మారిపోయాయి.

Published : 29 Nov 2022 01:18 IST

కాస్మెటిక్‌ ఛార్జీలందక వసతిగృహాల్లో ఇక్కట్లు

బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతిగృహాలు కాస్తా సం‘క్షామ’ గృహాలుగా మారిపోయాయి. ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నెలల తరబడి కాస్మెటిక్‌ ఛార్జీల చెల్లింపులు నిలిచిపోయాయి.  బడిబయట పిల్లలకు ఉద్దేశించిన కస్తూర్బా పాఠశాలల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. గత రెండేళ్లుగా వీరి ఖాతాల్లో సొమ్ములు వేయలేదు.. చేతికి కిట్లు అందించలేదు. దీంతో తలకు నూనె కొనాలన్నా.. ఒంటికి సబ్బు కావాలన్నా ఇంటికే వెళ్లాల్సి వస్తోంది.

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, పాయకరావుపేట

ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల పరిదిలో 139 ప్రీ మెట్రిక్‌, కళాశాల వసతి గృహాలున్నాయి. సుమారు 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అల్లూరి జిల్లాలో 204 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది బీసీ వసతిగృహ విద్యార్థులకు మినహా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పిల్లలకు ఈ నిధులు అందడం లేదు. అలాగే 34 కస్తూర్బా విద్యాలయాలున్నాయి. వీటిలో 7 వేల మందికి పైగా బాలికలు చదువుతున్నారు. వీరికి గతంలో కొన్ని నెలలు సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూలు, డిటర్జెంట్లు, టూత్‌బ్రష్‌ వంటివి ఓ కిట్‌ రూపంలో అందజేసేవారు. అంతకుముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ కిట్ల సొమ్ము జమచేసేవారు. కొవిడ్‌ తర్వాత వీరికి కిట్లు ఇవ్వలేదు.. ఖాతాల్లో సొమ్ములు వేయలేదు.

అవసరాలు తగ్గించుకుని..

అమ్మ, నాన్న అంతా ఒడిశాకు చేపలవేట నిమిత్తం వలస వెళ్లిపోయారు. చదువుకునేందుకు వసతిగృహంలో చేరాం. ఇప్పటివరకు కాస్మెటిక్‌ ఛార్జీలు రూపాయి అందలేదు. నెల, రెండు నెలలకోసారి మమ్మల్ని చూసేందుకు అమ్మో నాన్నో వస్తుంటారు. అప్పుడే ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు. వాటితోనే పొదుపుగా     నెట్టుకొస్తున్నాం. అవసరాలను తగ్గించుకుంటున్నాం. 

జి.దేవి, కె.అనుష్క, బాలికల వసతిగృహం,బోయపాడు, నక్కపల్లి మండలం

సాంకేతిక కారణాలే సాకు..

వసతిగృహ విద్యార్థులకు సకాలంలో బడ్జెట్‌ కేటాయించడం లేదు. సొమ్ముల్లేక సంరక్షకులు మెనూ కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. అయినా అధికారులు మాత్రం అబ్బే బడ్జెట్‌ ఉంది, సాంకేతిక కారణాలతో సొమ్ములు రావడం లేదని చెబుతున్నారు. విద్యార్థుల ఖాతాల నంబర్లలో తప్పులున్నాయని కొన్నాళ్లు చెప్పుకొచ్చారు. జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాలకు బడ్జెట్‌ కేటాయించడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలకు సర్దిచెబుతూ వస్తున్నారు. సొమ్ములెప్పుడు ఇచ్చేది చెప్పలేకపోతున్నారు. వసతిగృహాల్లో చదివే పిల్లలంతా నిరుపేద కుటుంబాల వారే. డబ్బుల్లేక చాలామంది రూ. ఐదు టూత్‌పేస్టులు, రూ.పది సబ్బు కొనుక్కుని పొదుపుగా వాడుకుంటున్నారు.


వసతిగృహ విద్యార్థులకు మాత్రం ఈ ఏడాది ఒక్క నెల కూడా కాస్మెటిక్‌ ఛార్జీలు అందించలేదు. పిల్లలు ఇంటికి వెళ్లినప్పుడే తల్లిదండ్రులను కొంత డబ్బులడిగి తెచ్చుకుంటున్నారు. వాటితోనే అరకొరగా సరిపెట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల సంరక్షకులు, ప్రిన్సిపల్స్‌ అప్పులు చేసి సదుపాయాలు కల్పించాల్సి వస్తోంది.


ప్రతి నెలా ఇస్తే బాగు

వసతిగృహానికి వచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క నెల డబ్బులు కూడా అందలేదు. మా ఇంట్లో వారు చూడటానికి వచ్చినప్పుడు ఇస్తున్న డబ్బులనే వాడుకుంటున్నాం. కాస్మెటిక్‌ ఛార్జీలు ప్రతినెలా ఇస్తే ఇబ్బంది ఉండేది కాదు.

ఎం.రాణి, తొమ్మిదో  తరగతి, పారుపాక, కాకినాడ జిల్లా

నిధులొస్తాయి..

వసతిగృహ విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్‌ ఛార్జీలకు త్వరలోనే నిధులు అందుబాటులోకి వస్తాయి. బీసీ విద్యార్థులకు ఇచ్చేశారు.. ఎస్సీ విద్యార్థులకు వచ్చే నెలలో అందే అవకాశం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అజయ్‌బాబు చెప్పారు. కస్తూర్బా బాలికల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించామని, త్వరలోనే వారి ఖాతాల్లో ఈ నిధులు జమచేస్తామని సమగ్రశిక్షా ఏపీసీ శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని