logo

యువ వైద్యాధికారుల చొరవ

ప్రభుత్వ వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావం చూపారు. జీనబాడు ఉప వైద్య కేంద్రం పరిధిలో వలసలగరువు గ్రామం రైవాడ జలాశయానికి ఆవలి ఒడ్డున అటవీప్రాంతంలో ఉంది.

Published : 28 Jan 2023 03:23 IST

కొండజర్తకు వెళ్తున్న వైద్యాధికారిణి హిమబిందు
దేవరాపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావం చూపారు. జీనబాడు ఉప వైద్య కేంద్రం పరిధిలో వలసలగరువు గ్రామం రైవాడ జలాశయానికి ఆవలి ఒడ్డున అటవీప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే పడవపై ప్రయాణించాల్సిందే. అక్కడ నివసిస్తున్న పది గిరిజన కుటుంబాల్లోని 30 మందికి వైద్యసేవలు అందడం లేదు. దీన్ని గమనించిన పినకోట యువ వైద్యాధికారులు గేదెల వెంకటేష్‌, డి.రూప్‌చంద్‌తో పాటు ఎంఎల్‌హెచ్‌పీ కె.తులసి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రవి, ఏఎన్‌ఎం కె.పుష్ప, హెల్త్‌ అసిస్టెంటు బి.రామరాజు తదితరులు చొరవ చూపారు. శుక్రవారం రెండు బోట్లలో సుమారు గంట సేపు రైవాడ జలాశయంలో ప్రయాణించారు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత కిలోమీటరు దూరం అడవిలో నడిచి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గిరిజనులందరికీ వైద్యం చేసి, తిరిగి జీనబాడు చేరుకున్నారు. వైద్య సిబ్బంది తరలివచ్చి వైద్యం అందించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యుల చొరవ తెలుసుకుని పలువురు అభినందించారు.

అడవిలో ప్రయాణించి వైద్యమందిస్తున్న సిబ్బంది

ఏడు కిలోమీటర్లు నడిచెళ్లి..

సీలేరు, న్యూస్‌టుడే: నాటు వైద్యానికి అందరూ దూరంగా ఉండాలని ధారకొండ పీహెచ్‌సీ వైద్యాధికారిణి డీకే హిమబిందు సూచించారు. శుక్రవారం గుమ్మిరేవుల పంచాయతీ మారుమూల కొండజర్త గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు ఏడు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటి వైద్యాధికారి హిమబిందు, సిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సుమారు 79 మందికి వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారిణి మాట్లాడుతూ వ్యాధిసోకిన వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందాలన్నారు. నాటువైద్యం, పసరుమందు జోలికి పోవద్దని చెప్పారు. పీహెచ్‌ఎన్‌ రాణి, ఫార్మసిస్ట్‌ మూర్తి, హెచ్‌ఎస్‌ పోతురాజు, ఆరోగ్య సహాయకులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని