logo

కలిసి పాడదాం ‘వందేమాతరం’

వందేమాతరం.. ఈ గీతాన్ని పాఠశాల విద్యార్థులంతా మరింత శ్రావ్యంగా... తప్పులు దొర్లకుండా ఆలపించడం ద్వారా దేశభక్తిని మరింతగా ఇనుమడింపజేసేందుకు బాల గాయకుడు దొంతంశెట్టి ధీరజ్‌ కార్యాచరణ రూపొందించాడు.

Updated : 28 Jan 2023 04:22 IST

వంద పాఠశాలల్లో గీతాలాపన
బాల గాయకుడు ధీరజ్‌ సంకల్పం
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

వందేమాతరం.. ఈ గీతాన్ని పాఠశాల విద్యార్థులంతా మరింత శ్రావ్యంగా... తప్పులు దొర్లకుండా ఆలపించడం ద్వారా దేశభక్తిని మరింతగా ఇనుమడింపజేసేందుకు బాల గాయకుడు దొంతంశెట్టి ధీరజ్‌ కార్యాచరణ రూపొందించాడు. తల్లిదండ్రుల సహకారంతో ఈ ఏడాది వంద పాఠశాలల్లో విద్యార్థుల్లో కలిసి ఈ గీతాన్ని ఆలపించడంతో పాటు పిల్లల శ్రుతికి అనుగుణంగా సంగీతం తయారు చేయించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాఠశాలల్లో రెండు చరణాలతో కూడిన వందేమాతరం గీతాన్నే ఆలపిస్తున్నారు. రాగయుక్తంగా... అర్థం మారకుండా సంపూర్ణ వందేమాతరం ఆలపించడం ద్వారా మరింత దేశభక్తి పెంచాలన్నది వీరి ఆలోచన.

ధీరజ్‌... నర్సీపట్నంలోని భాష్యం స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈటీవీ పాడుతా-తీయగా కార్యక్రమం-2018లో ఈ బాలుడే విజేతగా నిలిచాడు. తిరుమల, తిరుపతి దేవస్థానం ఎస్‌వీబీసీ ఛానల్‌ నిర్వహించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కీరవాణితో కలిసి పాడాడు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒడిశా, ముంబయి ఇలా అనేక చోట్ల సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వాసూరావు, కీరవాణి, సునీత, మనో, చిత్ర తదితర అగ్ర గాయకుల సమక్షంలో ధీరజ్‌ ప్రతిభని చాటుకున్నాడు. నర్సీపట్నం మకరజ్యోతి ఉత్సవాల్లోనూ భక్తి గీతాలను ఆలపించాడు. ఈటీవీ శ్రీదేవీ డ్రామా కంపెనీ కార్యక్రమంలోనూ ఆరు గీతాలను ఆలపించాడు. చిత్రలేఖనం, ఫొటోగ్రఫీలోనూ ఈ బాలుడికి ప్రావీణ్యం ఉంది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తల్లి స్థానిక బాలికల హైస్కూల్లో సంగీతం ఉపాధ్యాయిని, తండ్రి సంగీత మాస్టారు. జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి తమ అభిమతాన్ని వివరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు స్కూళ్లలో ధీరజ్‌ సంపూర్ణంగా వందేమాతరం ఆలపించాడు. దీన్నిప్పుడు పక్కా ప్రణాళికతో అమలు చేయాలన్నది ఆశయం. పట్టణ ప్రముఖులు పలువురు తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చారు.

తప్పుల్లేకుండా ఆలపించేలా..

వందేమాతరం దేశభక్తిని రగిలించే గీతం. దీన్ని నేటితరం పిల్లలంతా శ్రావ్యంగా... తప్పుల్లేకుండా ఆలపించేలా చూడాలన్నది ధీరజ్‌ సంకల్పం. అవసరమైన మైకు, సౌండ్‌బాక్సులు సమకూర్చుతున్నాం. ఈ గీతాన్ని ముద్రణ రూపంలో, రికార్డు రూపంలో పాఠశాలలకు అందజేయాలని యోచిస్తున్నాం. తద్వారా అందరూ అనుసరించేందుకు వీలుంటుంది. తొలుత జిల్లాలోని వంద పాఠశాలల్లో అమలు చేయాలన్నది మా ప్రయత్నం. అధికారుల ఆమోదం తీసుకుని మొదలు పెడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని