logo

నిధులు లేక.. పనులు పడక

పూర్తయిన పనిని ఇంజినీరింగ్‌ అధికారులు తనిఖీ చేసి ఎంబుక్‌లో నమోదు చేసేవారు.. బిల్లులు అప్‌లోడైన వెంటనే గుత్తేదారు ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేవి.. ఇదంతా ఒకప్పటి మాట.

Published : 07 Feb 2023 03:43 IST

గడువు తక్కువ.. బకాయిలు ఎక్కువ

అసంపూర్తిగా మిగిలిన వైద్యుల నివాస గృహాలు

జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటా కుళాయిలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ పనులు పూర్తి కావాలని పూర్తి కావాలన్నది లక్ష్యం.

పాడేరు, న్యూస్‌టుడే: పూర్తయిన పనిని ఇంజినీరింగ్‌ అధికారులు తనిఖీ చేసి ఎంబుక్‌లో నమోదు చేసేవారు.. బిల్లులు అప్‌లోడైన వెంటనే గుత్తేదారు ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేవి.. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. పనులు పూర్తి చేసి.. గుత్తేదారు బిల్లు జనరేట్‌ చేసి ఏళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కావట్లేదు. పాత బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రానంటున్నారు. ఆర్థిక సంవత్సరం (వచ్చే మార్చితో) ముగిసే తరుణం సమీపించింది. లక్ష్యాలను చేరుకోవాలని ఒక వైపు ప్రజాప్రతినిధులు, మరో వైపు ఉన్నతాధికారుల నుంచి ఇంజినీర్లకు ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ర.భ. శాఖల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.500 కోట్ల వరకు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ప్రధానంగా 212 గ్రామ సచివాలయాలు, 209 వరకు రైతుభరోసా కేంద్రాలు, 139 వరకు ఆరోగ్య భవనాలు, 106 వరకు పాల శీతలీకరణ భవనాలు, 45 వరకు హాట్‌ బజార్లు, పీఎంజీఎస్‌వై పథకం ద్వారా రూ.129 కోట్లతో తారురోడ్లు, మరో రూ.126 కోట్లతో రోడ్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇది కాకుండా సుమారు రూ.200 కోట్లతో డబ్ల్యూబీఎం రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.  నాడు-నేడు రెండో దశ ద్వారా సుమారు 845 పాఠశాలలు సుందరీకరణకు రూ.100 కోట్లతో పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు ఎస్‌సీఏ నిధుల ద్వారా ఏటా రూ.30 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ వివిధ దశల్లోనే ఉన్నాయి.

పాడేరులో ఇటీవల శంకుస్థాపన చేసిన శిక్షణ కేంద్రం


నాలుగేళ్ల క్రితం పాడేరు పట్టణంలో వైద్యుల కాలనీ నిర్మాణంతో పాటు ఓ ఆడిటోరియాన్ని మంజూరు చేశారు. పనులు మంజూరైన నాటికి నిధులు పుష్కలంగా ఉండడంతో టెండర్ల ప్రక్రియ సైతం వేగంగా జరిగి పనులు ప్రారంభించేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆయా భవనాల నిర్మాణానికి కేటాయించిన నిధులు ఎటువైపు మళ్లించారో తెలియకపోవడంతో కొరత ఏర్పడింది. గుత్తేదారు సైతం బిల్లులు రావని తెలిసి పక్కకు వెళ్లిపోయాడు. ఏళ్లు గడుస్తున్నా నిధుల లేమితో ఆ భవనాలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.


పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న పదకొండు మండలాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, చిన్న నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా సుమారు రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయి. అయితే చేపట్టిన పనులకు బిల్లులు సక్రమంగా విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందులో సగం పనులైనా జరిగే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.


గుత్తేదారుల అనాసక్తి

మిషన్‌ కనక్ట్‌ పాడేరులో భాగంగా రోడ్డు పనులు సుమారు రూ.200 కోట్లతో చేపట్టారు. ఈ పనులకు సంబంధించి గుత్తేదారులు సైతం మొదటి దశ పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పించారు. ఎఫ్‌టీవోలు జనరేట్‌ చేసినా నేటికీ డబ్బులు విడుదల కాలేదు. ఇదిలా ఉంటే మంజూరైన పనులు సైతం పరిపాలన మంజూరు లేదని వివిధ సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు సమాచారం. నాడు-నేడు రెండో దశకు సంబంధించి ఒక్కో పాఠశాల సుందరీకరణకు రూ.5 లక్షల వరకు మొదటి విడతగా డబ్బులు వేశారు. మూడు నెలల నుంచి రెండో విడత నిధులు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏటా రావాల్సిన రూ. 30 కోట్ల ఎస్‌సీఏ నిధుల్లో ఈ ఏడాది రూ. 20 కోట్ల వరకు విడుదల చేశారు. గ్రామ సచివాలయం, రైతుభరోసా నిర్మాణాలకు సంబంధించి బిల్లులు బకాయిలున్నాయి. 45 హాట్‌బజార్ల పనులు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. ఇలా బిల్లులు బకాయిలు కోట్లలో ఉంటే కొత్తగా పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని