logo

అతివల ఆర్థికాభివృద్ధికి కృషి

మన్యంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పందిరిమామిడిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గత నెలలో ఐదు రోజులపాటు కేవీకేలో 38 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Published : 07 Feb 2023 03:43 IST

చేపలు, రొయ్యలతో వంటకాలపై శిక్షణ

రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, వై.రామవరం, చింతూరు మండలాలకు చెందిన 38 మంది డ్వాక్రా మహిళలకు చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, సమోసా, అప్పడాలు, వడియాలు, కట్‌లెట్‌, పకోడి తదితర ఆహార పదార్థాలను తయారు చేసే విధానాలను చేసి చూపించారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: మన్యంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పందిరిమామిడిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గత నెలలో ఐదు రోజులపాటు కేవీకేలో 38 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (హైదరాబాదు) ఆర్థిక సహాయంతో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ లలితకామేశ్వరి ఆధ్వర్యంలో మత్స్య శాస్త్రవేత్త కె.వీరాంజనేయులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆర్థికంగా బలోపేతమవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహిళలకు శిక్షణతోపాటు యంత్ర పరికరాలను అందజేయనున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలూ మంజూరు చేసి దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.

శిక్షణలో తయారు చేసిన పచ్చళ్లు


ఎంతో ప్రయోజనం

చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై ఇచ్చిన శిక్షణతో మాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ గ్రామంలో సొంతంగా పదార్థాలు తయారు చేసి విక్రయిస్తాం.

సిద్దనాతి సత్యవతి, బండిగడ్డ, వై.రామవరం మండలం


భరోసా ఇచ్చారు

ఎటువంటి ఖర్చు లేకుండా మాకు ఉచితంగా చేపలు, రొయ్యలతో ఆహార పదార్థాల తయారీపై అయిదురోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వస్తువులు తయారుచేసి విక్రయించేందుకు యంత్రాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

బందం దుర్గాదేవి, సీతారం, దేవీపట్నం మండలం


శిక్షణతోపాటు సహకారం

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం. ఇందులో భాగంగానే జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆర్థిక సహకారంతో చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చాం. కేవలం శిక్షణతో సరిపెట్టకుండా మహిళలు ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఉచితంగా యంత్రపరికరాలను అందిస్తాం. బ్యాంకు రుణాలనూ మంజూరు చేయిస్తాం.

కె.వీరాంజనేయులు, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు