logo

శ్రమదానంతో రహదారి బాగు

గోతులు, రాళ్లమయంగామారిన రహదారిని శ్రమదానంతో బాగు చేసుకుంటున్నారు పెదగొంది గ్రామ గిరిజనులు.

Published : 07 Feb 2023 03:43 IST

పెదగొంది నుంచి కృష్ణాపురం వరకు రహదారి
బాగు చేసుకుంటున్న గ్రామస్థులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గోతులు, రాళ్లమయంగామారిన రహదారిని శ్రమదానంతో బాగు చేసుకుంటున్నారు పెదగొంది గ్రామ గిరిజనులు. పెదబరడ పంచాయతీ పెదగొందిలో సుమారు 30 పీవీటీజీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రధాన రహదారిపై కృష్ణాపురం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామానికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా ఉంది. బడి, గుడి, ఆసుపత్రికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరంలోని కృష్ణాపురం నడిచి వెళ్లాల్సిందే. ఈ గ్రామంలో ఇంతవరకు ఒక్క ప్రభుత్వ భవన నిర్మాణమూ జరగలేదు. నిత్యావసర సరకులు సరఫరా చేసే వాహనం కూడా ఇక్కడకు రాలేని పరిస్థితి. దీనిపై అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో యువకులంతా కలసి గోతులు, రాళ్లతో నిండిన రహదారిని బాగు చేసుకుంటున్నారు. నిత్యావసర సరకుల వాహనమైనా తమ గ్రామానికి వస్తుందని ఆశతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని గ్రామస్థులు గెమ్మెలి రమణ, పాంగి కామేశ్వరరావు, సుబ్బారావు చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తారురోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని