logo

సదరంలో అక్రమాలకు అడ్డుకట్ట

సదరం ధ్రువపత్రాలు పొందడంలో అక్రమాలకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులతో ఇప్పుడు కచ్చితత్వంతో ఇవి జారీ అవుతున్నాయి.

Published : 09 Feb 2023 02:11 IST

దివ్యాంగుడిని పరీక్షిస్తున్న వైద్యులు
నర్సీపట్నం, న్యూస్‌టుడే

 

 

సదరం ధ్రువపత్రాలు పొందడంలో అక్రమాలకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులతో ఇప్పుడు కచ్చితత్వంతో ఇవి జారీ అవుతున్నాయి. పింఛన్ల సొమ్ముకు ఆశించి ఇన్నాళ్లూ అంగవైకల్యం శాతం పెంపునకు కొందరు మధ్యవర్తులను ఆశ్రయించి పైరవీలు సాగించేవారు. ఇటువంటి వారి నుంచి ప్రతి సోమవారం స్పందనకు దరఖాస్తులు ఎక్కువుగా వచ్చేవి. ఇప్పుడు నేరుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పుతో వీటి నుంచి విముక్తి లభిస్తోంది.

* అంగవైకల్య శాతానికి అనుగుణంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది. 90 శాతానికి పైగా ఉన్న వారికి నెలకు రూ. 10 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తారు. సాధారణంగా శారీరక లోపం ఉన్న వారంతా దివ్యాంగ పింఛన్లు కోసం ముందుగా సచివాలయానికి దరఖాస్తు చేస్తే స్లాట్‌ బుక్‌ అవుతుంది. నిర్ణీత తేదీ నాడు ప్రభుత్వ వైద్యుని వద్ద పరీక్షలు చేయించుకొని ధ్రువపత్రాలు పొందుతారు. పెన్షన్‌కు తగిన శాతం లేని వారిలో కొందరు ఆ శాతం పెంపునకు సాఫ్ట్‌వేర్‌లో అవకాశం లేనందున నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోని స్పందనకు వినతులు అందజేసేవారు. ఫలితంగా ప్రతి సోమవారం వీరి తాకిడి ఎక్కువగా ఉండేది. దీంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఉద్యోగి ఒకరిని వీరి దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా స్పందనలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.

స్పందనకు దరఖాస్తుల వెల్లువ

వైకల్య శాతానికి పెంచుకోవడానికి దివ్యాంగుల నుంచి స్పందనకు దరఖాస్తులు వెల్లువెత్తేవి. వారం వారం ఇవి ఎక్కువవుతూనే ఉండేవి. కొందరు దొడ్డిదారిన అధిక శాతానికి ధ్రువపత్రాలు పొందేందుకు పైరవీలు చేసేవారు. డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చేవారు. తొలుత ధ్రువపత్రం చేతికి వచ్చిన నెల రోజులకు స్పందన నుంచి అనుమతి పొంది మళ్లీ ఆ డాక్టరు వద్దకే పరీక్షలకు వచ్చేవారు. ఈ పరిస్థితి వల్ల అక్రమాలు ఎక్కువవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకువచ్చింది. తిరస్కరణకు గురైన వారంతా స్పందనకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిరోధించింది.

రెండు పర్యాయాలు అవకాశం

సదరం ధ్రువపత్రాల జారీలో ఆన్‌లైన్లోని సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు. గత నెల నుంచి ఇవి అమల్లో ఉన్నాయి. తొలుత అందజేసిన వైకల్య శాతం పట్ల సంతృప్తి చెందని వారు స్పందనకు వెళ్లనవసరం లేదు. మరోసారి వైద్య పరీక్షల కోసం వీరు సచివాలయంలోనే దరఖాస్తు అందజేయొచ్చు. ఇలా రెండు సార్లు అప్పీలు పేరిట చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో వేర్వేరు వైద్యులు, ఆసుపత్రులు వీరికి కేటాయించేలా సాఫ్ట్‌వేరే నిర్ణయిస్తుంది. దీని వల్ల డాక్టర్లకు ఇబ్బందులు తొలుగుతాయి. వైకల్య శాతం పక్కాగా గుర్తించడానికి వీలుంటుంది.

మల్లికార్జునరావు, ఎముకల విభాగాధిపతి, నర్సీపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు