logo

బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేరిస్తే సహించం

బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండు చేస్తూ ఈ నెల 31న చేపట్టనున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు.

Published : 28 Mar 2023 05:07 IST

పెదబయలులో  నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండు చేస్తూ ఈ నెల 31న చేపట్టనున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అరకులోయ పట్టణంలోని వీధులు, యండపల్లివలస, కళాశాలలు, రవ్వలగుడ, శరభగుడ, సికాలనీ తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. గిరిజనసంఘం నాయకులు జోషి, రామన్న, బుజ్జిబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర హెచ్చరించారు. దీనిపై రాష్ట్ర క్యాబినెట్‌లో చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డుంబ్రిగుడలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. గిరిజనులకు ఉద్యోగ అవకాశాల్లో వంద శాతం రిజర్వేషన్‌ కల్పించే జీఓ నం. 3ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పుడు స్పందించని వైకాపా ప్రభుత్వం, ఇప్పుడు బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చడానికి తీర్మానించడం సరికాదన్నారు. దీనిపై గిరిజన ఎమ్మెల్యేలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీర్మానాన్ని నిరసిస్తూ ఈనెల 31న జేఏసీ, గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని తెలిపారు. తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు, ఎస్టీ సెల్‌ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు కమిడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి గ్రామీణం: అనంతగిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సుమారు 40 లక్షల జనాభా ఉన్న బోయలను ఎస్టీల్లో చేర్చడం సరికాదన్నారు. సర్పంచులు రూతు, మోస్య, ఆయా సంఘాల నాయకులు సన్యాసిరావు, గురుదొర, నాగులు, మురళి పాల్గొన్నారు.

పెదబయలు గ్రామీణం: రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ పెదబయలు మండల కేంద్రంలో తెదేపా, సీపీఎం, జనసేన నాయకులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి స్టేట్‌ బ్యాంకు వరకు ర్యాలీగా వచ్చారు. బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదిస్తూ తీర్మానం చేయడంపై మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో వైకాపా ఎమ్మెల్యేలు ఉండీ ఉపయోగమేంటని ప్రశ్నించారు. తెదేపా మండల ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు సన్నిబాబు, కూడా భూషణ్‌రావు, పృధ్వీరాజు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

పాడేరు పట్టణం: బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేరుస్తూ శాసనసభలో చేసిన తీర్మానంపై గిరిజన ఎమ్మెల్యేలు తమ వైఖరిని ప్రకటించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్సయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్మానంపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారన్నారు.

చింతపల్లి గ్రామీణం, గూడెంకొత్తవీధి: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు, కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు జైతి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో చింతపల్లిలో వేర్వేరుగా నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ సుమారు 50 లక్షల మంది జనాభాను ఎస్టీ జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. వైకాపా ప్రభుత్వం ఓటు రాజకీయాలు చేస్తోందన్నారు.గూడెంకొత్తవీధి మండలం దేవరాపల్లి సర్పంచి బుజ్జిబాబు మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం జరిగేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

రంపచోడవరం/ గ్రామీణం, ఎటపాక, అడ్డతీగల, చింతూరు: బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చవద్దని ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంగల శ్రీనువాసు, కత్తుల ఆదిరెడ్డి డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఐటీడీఏ ఎదుట ఆదివాసులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఐటీడీఏ కార్యాలయం లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. కొంతమందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు వెళ్లి ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందించారు. దీనిపై శాసనసభలో చేసిన తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు గౌరవ అధ్యక్షురాలు కురుసం వరలక్ష్మి పీవోకు వినతిపత్రం అందించారు. ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షుడు ఇల్ల రామిరెడ్డి, నాయకులు వంజం జోగారావు, కొండమొదలు సర్పంచి వేట్ల విజయ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.  తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐ.వి.రమణ, జేఏసీ కన్వీనర్‌ రాజు డిమాండు చేశారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మల్లం సుబ్బమ్మ, కన్నయ్య, దేశయ్య, వెంకయ్య, పొదియం రాధ, పార్వతి పాల్గొన్నారు.

రంపచోడవరంలో ర్యాలీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని