logo

మంచిగా నటిస్తూ మట్టుపెట్టాడు!

మండల సరిహద్దులోని పురుషోత్తపట్నం శివారులో ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతో భర్తే హత్య చేసినట్లు గుర్తించారు.

Published : 28 Mar 2023 05:07 IST

భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ మహేశ్వర్‌రెడ్డి

ఎటపాక, న్యూస్‌టుడే: మండల సరిహద్దులోని పురుషోత్తపట్నం శివారులో ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతో భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. ఏఎస్పీ మహేశ్వర్‌రెడ్డి సోమవారం ఎటపాక పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా పులకనకొండా గ్రామానికి చెందిన కుమార్‌, సోంది రామ్‌(33) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా భార్యపై అనుమానంతో భర్త వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లలను బంధువుల వద్ద ఉంచి, భర్తను విడిచిపెట్టి భద్రాచలం పట్టణంలోని సుందరయ్యనగర్‌లో రామ్‌ నివాసముంటోంది. ఈమె ఆచూకీ తెలుసుకున్న కుమార్‌ 15 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమెతో మంచిగా ఉంటున్నట్లు నటించి ఈనెల 14న సాయంత్రం ఆమెను పురుషోత్తపట్నం శివారులోని దేవస్థానం భూముల వద్దకు తీసుకెళ్లారు. మృతురాలికి మద్యం తాగే అలవాటు ఉండటంతో ఆమెతో మద్యం తాగించాడు. ఆ తర్వాత ఆమె నడుస్తూ ఉన్న సమయంలో వెనుక నుంచి తలపై గట్టిగా రాయితో కొట్టాడు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోవడంతో ముఖం నుజ్జయ్యేలా గట్టిగా కొట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహానికి దిండు అడ్డుగా పెట్టి పరారయ్యాడు. రామ్‌ నివాసమున్న అద్దె ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. కుమార్‌ అక్కడకు రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ గజేంద్రకుమార్‌, ఎస్సై పార్థసారథి తదితరులను ఏఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని