logo

ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఎనిమిది నెలలు..

గ్రామాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందుకే గడపగడపలో సమస్యలు తెలుసుకుంటున్నాం. మీ గ్రామంలో సమస్యలను కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తాం.

Published : 01 Jun 2023 02:47 IST

ఎర్రవరంలో ఎక్కడి సమస్యలక్కడే!
గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

2022 అక్టోబర్‌ 12న ఎర్రవరం గ్రామంలో స్థానికులు ఇచ్చిన వినతిపత్రాన్నిపరిశీలిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

గ్రామాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందుకే గడపగడపలో సమస్యలు తెలుసుకుంటున్నాం. మీ గ్రామంలో సమస్యలను కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తాం.

ఇది 2022 అక్టోబర్‌ 12న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎర్రవరం గడపగడపకు వచ్చినప్పుడు సర్పంచి సహా స్థానిక పాలకుల సమక్షంలో గ్రామస్థులకు ఇచ్చిన హామీ.

ఎనిమిది నెలలవుతున్నా తాగు నీటి సమస్య పరిష్కారం కాలేదు. సిమెంటు రోడ్లకు సామగ్రి వేసినా పని మొదలు పెట్టలేదు. వీటితోపాటు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.

గూడెం కొత్తవీధి మండలంలోని ఎర్రవరంపై పాలకులు, అధికారులు ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. తమకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీకేవీధి పంచాయతీ ఆర్వీనగర్‌ సమీపంలోని ఎర్రవరంలో గిరిజనులు, గిరిజనేతరులు, శ్రీలంక కాందిశీకులు కుటుంబాలు 60పైగా నివసిస్తున్నాయి. శ్రీలంకలో కరవు తాండవించినప్పుడు శరణార్ధులుగా ఉన్న కాందిశీకులను ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడికి తీసుకువచ్చి కాఫీ తోటల్లో పనులు కల్పించారు. అప్పటి నుంచి వారు ఇక్కడే ఉన్నారు. వారికి ఇక్కడ రేషన్‌కార్డు మంజూరు కాక పరాయి జీవనం గడుపుతున్నారు. వారితోపాటు స్థానికులు నివసిస్తున్న ఆ గ్రామంలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నవి రెండు కొళాయిలే. ఆ నీరు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో అంతర్గత రహదారులు దారుణంగా ఉన్నాయి. వర్షం పడితే బురదమయంగా మారి ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యలపై ఎనిమిది నెలల కిందట గ్రామానికి గడపగడపకు వచ్చిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మంచినీరు కల్పించి, సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. స్పందించిన ఆమె కొద్దిరోజుల్లోనే ఈ సమస్యలు పరిష్కరిస్తామని సర్పంచి, జట్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల సమక్షంలోనే హామీ ఇచ్చారు.

సిమెంట్‌ రోడ్డు నిర్మాణం కోసం తెచ్చిన ఇసుక, పిక్కరాయి

ఇసుక, రాయి తెచ్చి వదిలేశారు: గ్రామంలో అంతర్గత సిమెంట్‌ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 2.50లక్షల నిధులు కేటాయించారు. ఈ పనులను చేజిక్కించుకున్న స్థానిక వైకాపా యువ నాయకుడే గుత్తేదారుగా మారి హడావిడిగా ఇసుక, పిక్కరాయి తెచ్చి వేశారు. ఈ మెటీరియల్‌ తెచ్చి నెలలు గడిపోతున్నా పనులు చేపట్టలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు బురదగా మారి రాకపోకలకు స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మంచినీటి సమస్యా పరిష్కారం కాలేదు. మా గ్రామానికి వచ్చి సమస్యలను కళ్లారా చూసిన ఎమ్మెల్యే పరిష్కరిస్తారని ఆశతో స్థానికులు ఎదురు చూస్తున్నారు.


నీళ్ల కోసమూ నిరీక్షణే

మా గ్రామంలో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ముఖ్యంగా మంచినీటికి కష్టాలు పడుతున్నాం. ఉన్న రెండు కుళాయిల ద్వారా ఎప్పుడో వచ్చే కొద్ది నీటి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. సీసీరోడ్లు లేక ఇబ్బందిగా ఉంది. మా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఈ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఎనిమిది నెలలైనా అపరిష్కృతంగానే ఉన్నాయి.

నేతల హరి, స్థానికుడు, ఎర్రవరం


పరిష్కరించేందుకు చర్యలు

ఎర్రవరం గ్రామంలో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థానికులు వినతి ఇచ్చిన వెంటనే రూ. 2.50లక్షల నిధులు సిమెంట్‌ రోడ్డుకి మంజూరు చేశారు. ఆ పనులు పూర్తి చేసేలా చూస్తాం. మంచినీటి సమస్యనూ పరిష్కరిస్తాం.

సుభద్ర, సర్పంచి, జీకేవీధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని