logo

పునరావాసానికి ఇంకెన్నేళ్లు...!

పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీ నిర్మాణం నత్తతో పోటీ పడుతుంది. ఏళ్లు గడిచిపోతున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు.

Published : 01 Jun 2023 02:47 IST

కూనవరం, న్యూస్‌టుడే

పూర్తైన గృహాలు

పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీ నిర్మాణం నత్తతో పోటీ పడుతుంది. ఏళ్లు గడిచిపోతున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు నిర్వాసితుల సమస్యపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూనవరం మండలం భైరవపట్నంలో పోలవరం నిర్వాసితుల కోసం ఒక కాలనీ నిర్మాణాన్ని ఆరేళ్ల క్రితం చేపట్టారు. ఇక్కడకు వీఆర్‌పురం మండలం జీడిగుప్పకు చెందిన 159 మంది నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉంది. వీరి కోసం 159 ఇళ్లను కట్టి అప్పగించే బాధ్యతను అప్పటి ప్రభుత్వం ర.భ శాఖ అధికారులకు అప్పగించింది. 2018నాటికే దాదాపు 50 శాతం పనులు పూర్తిచేసిన గుత్తేదారు ఆ తరువాత పనులు ఆపివేశారు. అప్పటి నుంచి పనులు మందకొడిగానే సాగుతున్నాయి. సింగిల్‌ హౌస్‌ల నిర్మాణాలు మొత్తం పూర్తికాగా... జాయింట్‌ హౌస్‌లు మాత్రం చివరి దశలో ఉన్నాయి. కాలనీలో నిర్మించాల్సిన ప్రభుత్వ భవనాలు పునాదులు దాటడం లేదు. కాలనీకి వెళ్లే మార్గం రాళ్లు, గుంతలతో నిండి ఉంది. వరదలతో ఈ కాలనీ కేటాయించిన గ్రామం జీడిగుప్ప ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఇక్కడి వారిని హుటాహుటిన తరలించాలని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం కనిపించడం లేదు. గతేడాది గోదావరి వరదలు వరుసగా మూడు నెలల పాటు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం వస్తోంది. మరోసారి వరదలు ఎదుర్కోవాలనే తలంపు వీరిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అధికారులు వేగంగా పునరావాస కాలనీ నిర్మాణాలను పూర్తిచేసి తమను తరలించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

పునాదుల్లోనే మగ్గుతున్న ప్రభుత్వ భవన నిర్మాణం


కాలనీ ఇంకా అప్పగించలేదు

కూనవరం మండలం భైరవపట్నంలో ర.భ శాఖ ఆధ్వర్యంలో కాలనీ నిర్మిస్తున్నారు. ఇది ఇంకా పూర్తికాలేదు. వారు పూర్తిచేసి అప్పగించిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో నిర్వాసితులను ఆ కాలనీకి తరలిస్తాం. వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే గుత్తేదారుకు ఆదేశాలు అందాయి.

శ్రీధర్‌, తహసీల్దార్‌, వీఆర్‌పురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని