logo

మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మైదాన ప్రాంత సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలని ట్రైబల్‌ రైటర్స్‌ ఫోరం ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.వరహాల దొర డిమాండు చేశారు.

Published : 01 Jun 2023 02:47 IST

ట్రైబల్‌ రైటర్స్‌ ఫోరం డిమాండ్‌

ట్రైబల్‌ రైటర్స్‌ ఫోరం ప్రతినిధులు, నాయకుల సంఘీభావం

రావికమతం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మైదాన ప్రాంత సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలని ట్రైబల్‌ రైటర్స్‌ ఫోరం ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.వరహాల దొర డిమాండు చేశారు. అనకాపల్లి జిల్లా ట్రైబల్‌ రైటర్స్‌ ఫోరం సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు అధ్యక్షతన బుధవారం రావికమతంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరహాల దొర మాట్లాడుతూ బోయ, వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు. 52 వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 50 శాతం గిరిజనులుండే గిరిజన గ్రామాల్ని షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆదివాసీ చట్టాలపై అవగాహన చేసుకొని గిరిజనులు అందరికీ తెలియజేయాలని చెప్పారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.పూర్ణారావు మాట్లాడుతూ గిరిజనులకు బలమైన సంఘం ఉండాలన్న ఉద్దేశంతో 2007లో ఫోరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లా నూతన కార్యవర్గ ఏర్పాటు

ఫోరం నూతన కమిటీని వరహాల దొర ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడిగా అల్లం ఎరకన్నదొర, ఉపాధ్యక్షులుగా వడ్డి దేముడు, తగ్గి దుర్గమ్మ, ప్రధాన కార్యదర్శిగా గోగం వరహాల దొర, సహాయ కార్యదర్శిగా కంటముఖి బాబ్జి, కోశాధికారిగా రొబ్బా సతీష్‌లను ఎన్నుకున్నారు. జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ఎస్టీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని