logo

ధరాఘాతం.. ఎగుమతులపై ప్రభావం!

నర్సీపట్నం నుంచి ఈ ఏడాది పసుపు ఎగుమతులు మందగించాయి. ఇక్కడి నుంచి ఏటా రూ. కోట్ల విలువైన పసుపు వివిధ రాష్టాలకు ఎగుమతి అవుతుంటుంది.

Updated : 04 Jun 2023 05:50 IST

విశాఖ మన్యంలో పండే ఛాయ పసుపు

నర్సీపట్నం నుంచి ఈ ఏడాది పసుపు ఎగుమతులు మందగించాయి. ఇక్కడి నుంచి ఏటా రూ. కోట్ల విలువైన పసుపు వివిధ రాష్టాలకు ఎగుమతి అవుతుంటుంది. మంచి ఛాయ కలిగినది కావడంతో మన్యంలో పండించే సరకుకి గిరాకీ ఎక్కువ. ఈ ఏడాది సీజన్‌ మొదట్లో కేజీకి సుమారు రూ.65 వరకు ధర లభించేది. కొద్దిరోజులుగా రూ.40 నుంచి రూ.50 దాటడంలేదు. మైదాన ప్రాంతాల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే చిరు వ్యాపారులు ఇంతకంటే తక్కువగానే చెల్లిస్తున్నట్టు సమాచారం.

న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌, పాడేరు పట్టణం

గతంలో వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి తమకే పసుపు తమకే విక్రయించాలని, తోటి వ్యాపారుల కంటే రూపాయి ఎక్కువే ఇస్తామని చెప్పేవారు. ఈ ఏడాది రైతులు వ్యాపారుల వద్దకు వచ్చి కొనుక్కోమని కోరుతున్న పరిస్థితి ఉంది. దుంప రకం పసుపును తమిళనాడులో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొమ్ము రకాలు కేరళ, మహరాష్ట్ర తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. దుగ్గిరాల ప్రాంతంలోని పసుపుతో పోల్చితే అల్లూరి జిల్లాలో లభ్యమయ్యే పనుపులో కుర్క్‌మిన్‌ ఎక్కువగా ఉంటోంది. ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గిన ప్రభావం కొనుగోళ్ల పడటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులను ఆదుకోవడానికి మంచి ధర ఇచ్చి జీసీసీ కొనుగోలు చేయాలని వారంతా కోరుతున్నారు. నర్సీపట్నంలో దాదాపు 25 మంది వ్యాపారులు ఉన్నారు. సీజన్‌లో రోజుకు యాభై టన్నుల వరకు కొనుగోలు చేస్తుంటారు. పసుపు గ్రేడింగ్‌, ఎగుమతులు, దిగుమతులతో పెదబొడ్డేపల్లిలోని మార్కెట్‌యార్డు నిత్యం కళకళలాడుతూ ఉంటుంది.


రైతులను ఆదుకోవాలి...

పసుపు రైతులకు ఈ ఏడాది గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. పెట్టుబడులు, ఆదాయం చూసుకుంటే వారికి నిరాశే మిగులుతోంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది. రైతు బాగుంటేనే కూలీలకు పని ఉంటుంది. వ్యాపారాలు సాగుతాయి. గ్రామాలు తిరిగి రైతుల వద్ద పసుపు కొంటుంటాం. ధరలు పడిపోవడంతో రైతులు కలత చెందుతున్నారు.
చిత్రాడ బోడకొండ, వ్యాపారి, లోతుగెడ్డ, అల్లూరి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని