logo

నిద్రపోతున్ననిఘా!

రాష్ట్రంలో విశాఖ రైల్వేస్టేషన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు  వస్తారు. నిత్యం 120 ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Published : 10 Jun 2023 01:23 IST

ఈనాడు, విశాఖపట్నం, రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విశాఖ రైల్వేస్టేషన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు  వస్తారు. నిత్యం 120 ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న చోట సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. స్టేషన్‌కు నలువైపులా సరిపడినన్ని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఉన్న వాటి వల్ల ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ఫలితంగా స్టేషన్‌లో దొంగతనాలు, కిడ్నాప్‌లకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.

సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో పరిశీలిస్తున్న అధికారులు

దృశ్యాల్లో స్పష్టత లేక: మూడు నెలల కిందట నర్సీపట్నం యువకులు ఇద్దరు భువనేశ్వర్‌ వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చారు. ఒకరు ప్లాట్ఫాం మీద నిరీక్షించగా మరొకరు టికెట్ తీసుకునేందుకు వెళ్లారు. టికెట్‌ తీసుకొని వచ్చేసరికి... ప్లాట్ఫాంపై ఉండాల్సిన వ్యక్తి కనిపించలేదు. స్టేషన్‌లో వెతికినా ఆచూకీ లభించలేదు. జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ   ప్లాట్ఫాంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అవి సక్రమంగా పనిచేయకపోవడంతో దృశ్యాల్లో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా గురువారం ఏడాదిన్నర బాలుడు కిడ్నాప్‌నకు గురైన తరువాత కూడా ఇదే తరహా సమస్య ఎదురయింది. ప్లాట్ఫాం 8లో 34వ స్తంభం వద్ద ఆ చిన్నారి కిడ్నాప్‌నకు గురయ్యాడు. దానికి సమీపంలో 35వ స్తంభం వద్ద కెమెరా ఉన్నప్పటికీ దృశ్యాల్లో స్పష్టత లేదు. దీంతో ఈ కేసును వెంటనే ఛేదించడంలో విఫలమయ్యారు.

పరిమిత సంఖ్యలోనే: విశాఖపట్నం స్టేషన్‌లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నిఘా చాలా అవసరం. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో సరకులు, గంజాయి, మత్తుపదార్థాలను తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఏ రైలు నుంచి ఎవరు వస్తున్నారు, ఎక్కడ దిగి ఎలా వెళ్తున్నారు ఇతర అనుమానితులను గుర్తించడంలో కెమెరాల పాత్ర కీలకం. అయినా పరిమిత సంఖ్యలోనే ఇవి ఉన్నాయి. దాదాపు 200లకుపైగా సీసీ కెమెరాలు అవసరం. 47 ఏర్పాటు చేయగా..అందులో 19 పని చేయడం లేదని సమాచారం. వీటిలో కొన్ని కెమెరాల గడువు పూర్తయిపోయింది. ఇంకొన్ని కెమెరాల్లోని దృశ్యాలు నమోదు కావడం లేదు. కొన్నింటికి శాటిలైట్‌ సిగ్నల్‌ నాట్‌ వర్కింగ్‌ అని చూపిస్తున్నాయి. వీటి సిగ్నలింగ్‌ వ్యవస్థను టెలికం విభాగం    పర్యవేక్షించాల్సినప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.  కేవలం ప్రధాన ద్వారాలు, ప్రవేశ మార్గాలు, మెట్లు, ఎక్స్‌లేటర్లు వద్ద ఉన్నవే పనిచేస్తున్నాయి.

ఆదాయంపైనే దృష్టి: స్టేషన్‌లో నిఘా కెమెరాల వ్యవస్థ సక్రమంగా లేదని జీఆర్‌పీ నుంచి పలుమార్లు రైల్వే అధికారులకు తెలిపినా ప్రయోజనం కనిపించలేదు. లేదు. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇక్కడి లోపాలను గుర్తించారు. ఎక్కడెక్కడ ఏ కెమెరాలు.. ఏవిధంగా ఏర్పాటు చేయాలో కూడా తెలిపారు.  రైల్వే అధికారులు ఆదాయం వచ్చే అంశాల మీద దృష్టిసారిస్తున్నారు తప్ప ఇటువంటి వాటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కెమెరాలు రైల్వే అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా...స్టేషన్‌ ఆధునికీకరణ పేరుతో పట్టించుకోకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని