logo

Andhra News: గుంటూరులో దారుణం: రూ.200 కోసం లారీతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. మహిళ మృతి

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.200 ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్‌ మహిళను ఈడ్చుకెళ్లాడు.

Updated : 20 May 2022 10:49 IST

గుంటూరు (తూర్పు): గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.200 ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్‌ మహిళను ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో లారీ కింద పడి ఆమె మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన రమణ(40) అనే మహిళ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉపాధి కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లేందుకు ఆమె ఓ లారీ ఎక్కింది. గుంటూరులోని నాయుడుపేట జిందాల్‌ కంపెనీ సమీపంలోకి చేరుకోగానే పిల్లలతో సహా రమణ లారీ దిగింది. తన వద్ద ఉన్న రూ.వందను డ్రైవర్‌కు ఇవ్వగా.. అతను మరో రూ.200 ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

తన వద్ద డబ్బుల్లేవని రమణ ఎంత చెప్పినా వినని డ్రైవర్‌.. ఆమె కుమార్తె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ని లాక్కొని వెళ్లిపోసాగాడు. సెల్‌ఫోన్‌ని తీసుకోవాలనే ఉద్దేశంతో రమణ కుమార్తె లారీ ఎక్కగానే డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడు. అది చూసి కంగారు పడిన రమణ.. లారీని పట్టుకుని పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి లారీ కింద పడి మృతి చెందింది. మహిళ మృతి చెందడం చూసిన డ్రైవర్‌.. లారీ ఆపి అందులోని పాపను కిందికి దించి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని