logo

జాప్యం ఖరీదు రూ.2కోట్లు

దుర్గగుడికి విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేందుకు సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట నిర్ణయించారు. విజయవాడ శివారు పాతపాడులో ఉన్న ఐదెకరాల ఆలయ స్థలంలో మూడేళ్ల కిందట ప్లాంట్‌ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఇప్పటికి రెండేళ్లవుతున్నా..

Updated : 23 May 2022 10:32 IST

అందుబాటులోకి రాని సౌర విద్యుత్తు ప్లాంట్‌
దుర్గగుడికి ఏటా రూ.90 లక్షలపైనే కరెంటు బిల్లులు
ఈనాడు, అమరావతి

దుర్గగుడికి విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేందుకు సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట నిర్ణయించారు. విజయవాడ శివారు పాతపాడులో ఉన్న ఐదెకరాల ఆలయ స్థలంలో మూడేళ్ల కిందట ప్లాంట్‌ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఇప్పటికి రెండేళ్లవుతున్నా.. అక్కడ ఉత్పత్తిని ఆరంభించలేదు. ప్లాంట్‌ ద్వారా  విద్యుత్తును నున్న సబ్‌స్టేషన్‌కు తరలించేందుకు అవసరమైన లైన్‌ను వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్తంభాలు, కేబుళ్ల ఏర్పాటు పనులు ఆరంభించి మధ్యలోనే వదిలేశారు. ప్రధానంగా మధ్యలోని పాతపాడు సహా కొన్ని గ్రామవాసులు ఈ లైన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాల్సిన అధికారులు చొరవ చూపించడం లేదు. దీనివల్ల ఏటా దుర్గగుడికి రూ.90 లక్షలకు పైగా విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు.

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడితో పాటు కొండ దిగువున ఉన్న భవనాలు, జమ్మిదొడ్డి కార్యాలయం, సి.వి.రెడ్డి ఛారిటీస్‌, మాడపాటి సత్రం, ఉద్యోగుల క్వార్టర్లు సహా అన్నింటికీ కలిపి నెలకు రూ.8 లక్షల వరకు విద్యుత్తు బిల్లులకు ఖర్చవుతోంది. ఏటా కనీసం రూ.90 లక్షలు దాటుతోంది. ఏటా 13 లక్షల యూనిట్ల వరకూ విద్యుత్తు అవసరమవుతోంది. ఈ స్థాయిలో భారీగా విద్యుత్తు బిల్లులకు ఖర్చవడంతో సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట అప్పటి అధికారులు ప్రతిపాదనలు చేశారు. అనుకున్నట్టుగానే ప్రణాళికలు రూపొందించి, పనులు పూర్తిచేశారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడడం లేదు. ఈ ప్లాంట్‌ నిర్మాణంతో దుర్గగుడికి ఏటా కనీసం రూ.కోటి ఆదా అవుతుందని అంచనా వేశారు. రెండేళ్లుగా అందుబాటులోకి తీసుకురాకుండా ఉంచేయడంతో రూ.2 కోట్ల వరకూ ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.

రూ.4.64 కోట్ల ఖర్చుతో..

సౌర విద్యుత్తు ప్లాంట్‌ మొత్తం వ్యయం రూ.4.64 కోట్లు కాగా, రాయితీ  రూ.92.8 లక్షలు లభించగా, దేవస్థానానికి రూ.3.71 కోట్లు ఖర్చయింది. ప్లాంట్‌ ద్వారా ఏటా 16లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఆలయానికి ఏటా ఖర్చయ్యే 13లక్షల యూనిట్లు కాకుండా.. మరో 2లక్షలకు పైగా యూనిట్లు మిగులుతాయి. దీనిని విద్యుత్తు శాఖే తీసుకుని ఏటా రూ.14లక్షల వరకు తిరిగి దేవస్థానానికే చెల్లిస్తుంది. ప్రస్తుతం ఆలయానికి వస్తున్న రూ.90లక్షల విద్యుత్తు బిల్లులు మిగలడంతో పాటు, ఏటా రూ.14 లక్షలు కలిపితే.. కనీసం రూ.కోటి ఆదా అవుతుంది. ప్లాంట్‌కు పెట్టిన రూ.3.71 కోట్ల వ్యయం నాలుగేళ్లలోపే తిరిగి వచ్చేస్తుంది. సోలార్‌ ప్లాంట్‌ 20 ఏళ్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని అంచనా. అంటే మిగతా 16 ఏళ్లకు  తీసుకున్న యూనిట్లకు తిరిగి విద్యుత్తుశాఖే చెల్లింపులు చేస్తుండడంతో దుర్గగుడికి మరింత ఆదాయమూ సమకూరనుంది.  

ఈవోలు, అధికారులు మారుతుండడంతో..

పాతపాడులోని ఐదెకరాల స్థలంపైనా గత నాలుగేళ్లుగా ఎలాంటి ఆదాయం రావడం లేదు. దుర్గగుడికి ఏటా ఈవోలు మారుతూ ఉండడంతో సౌర విద్యుత్తు ప్లాంట్‌ను అందుబాటులోనికి తీసుకురావడంలో అధికారుల చొరవ కరవవుతోంది. ప్లాంట్‌కు ప్రణాళికలు రూపొందించినది ఒకరి హయాంలో.. నిర్మాణం మరొకరి హయాంలో జరిగింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఈవోలు మారారు. దీంతో దీని వల్ల ఆలయానికి కలిగే లబ్ధి గురించి అధికారులకు అవగాహన ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు సైతం తరచూ మారుతుండడంతో వారి పర్యవేక్షణ కూడా కొరవడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విద్యుత్తు విభాగంతో మాట్లాడి ప్లాంట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే దుర్గగుడికి కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని