Indrakeeladri: దుర్గమ్మ అంతరాలయ దర్శనం మరింత భారం
విజయవాడ దుర్గగుడిలో సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారు. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడం దుర్గగుడిలో పరిపాటిగా మారింది.
అంతరాలయ దర్శనంటికెట్ రూ.300లే ఎక్కువనుకుంటే రూ.500 చేశారు
ఈనాడు, అమరావతి- న్యూస్టుడే, ఇంద్రకీలాద్రి
విజయవాడ దుర్గగుడిలో సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారు. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడం దుర్గగుడిలో పరిపాటిగా మారింది. గతంలో రూ.50, రూ.100 టికెట్లు మాత్రమే ఉండగా.. దసరాలో వీఐపీ టికెట్ అంటూ రూ.300 పెట్టారు. ఆ తర్వాత దసరా ముగిసినా.. టికెట్ మాత్రం తగ్గించలేదు. అంతరాలయం రూ.100 టికెట్ను రూ.300కు ఒకేసారి రెండు రెట్లు పెంచేశారు. రూ.50 టికెట్ తీసేసి.. రూ.100 చేశారు. దానిపైనే తీవ్ర విమర్శలు రావడం, అప్పటి పాలకమండలి సభ్యులు సైతం వ్యతిరేకించడంతో ఇదిగో తగ్గిస్తాం.. అదిగో తగ్గిస్తామంటూ అప్పటి ఈవో కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.300 టిక్కెటే భారంగా మారిందని భక్తులు బాధపడుతుంటే.. ఏకంగా రూ.500కు పెంచేశారు.
కేవలం రూ.30 విలువ చేసే రెండు లడ్డూలను ఇచ్చి.. ఒకేసారి రూ.200 ధర పెంచేయడం.. చాలా దారుణమని భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడిలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా.. టికెట్ ధరను మాత్రం ఇలా పెంచేసుకుంటూ వెళుతున్నారు. తిరుపతిలో సైతం రూ.300 టిక్కెటే సాధారణ భక్తులకు ఉండగా.. దుర్గగుడిలో రూ.500కు పెంచేశారు. దుర్గగుడిలో సాధారణ రోజుల్లో పది నుంచి 20వేల మంది మాత్రమే భక్తులు వస్తున్నారు. శుక్ర, ఆదివారాల్లో 30వేలు ఉంటున్నారు. గతంలో రూ.100 ధర ఉన్న సమయమంలో అంతరాలయ దర్శనం భారీగా చేసుకునేవాళ్లు. ఎప్పుడైతే రూ.300కు పెంచారో.. అంతరాలయ దర్శనం చేసుకునే సాధారణ కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఆదాయం పెరిగే అవకాశం తక్కువే..
టిక్కెట్ పెంచినంత మాత్రాన ఆలయ ఆదాయం భారీగా పెరుగుతుందనే గ్యారెంటీ కూడా లేదు. అంతరాలయం రూ.500కు పెంచేస్తే.. రూ.300తో ఇక దూరం నుంచి ముఖమండప దర్శనమే చేసుకునే వీలుంది. ముఖమండప దర్శనానికి, రూ.100 టికెట్తో దర్శనం చేసుకునే క్యూలైన్కు పెద్దగా తేడా ఉండదు. ముఖమండపం కంటే రూ.100 టికెట్తోనే అమ్మవారి దర్శనం మరింత బాగా జరుగుతుంది. దీంతో రూ.300 టికెట్లు కొనేవారంతా పెద్దగా తేడాలేదు.. దసరాలో అంటే ఎంత పెంచినా కొనుగోలు చేస్తారు. సాధారణ రోజుల్లో ఇంత ధర పెట్టి కుటుంబాలతో వచ్చేవారు టిక్కెట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
ఇక ప్రముఖులకేనా..
టికెట్ ధరను ఒకేసారి పెంచేయడంతో ఇక అంతరాలయ దర్శనం అనేది ఆర్థికంగా బాగా ఉన్నవారు, ప్రముఖులకే పరిమితం కానుంది. రూ.300 ధరనే భరించలేకపోతున్నాం.. తగ్గించమంటూ భక్తులు కోరుతుంటే దానిని మరింత పెంచేయడం సరైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం వల్ల.. సాధారణ రోజుల్లో భక్తుల రద్దీ లేని సమయంలో అంతరాలయ దర్శనం ఎవరికీ లేకుండా.. ఖాళీగా ఉంచడమే అవుతుంది. దానికి బదులుగా సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా రూ.300 ధరనే కొనసాగించడం మంచిది.
దర్శనంలో వ్యత్యాసాలు తగవు
దుర్గమ్మ దర్శనం తిరుమల తరహాలో అందరికి ఒకే విధంగా ఉంటే బాగుంటుంది. అంతరాలయం పేరుతో కేవలం డబ్బులున్నవారికి మాత్రమే దర్శనం కల్పిస్తే అధికశాతం ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు జీవిత కాలంలో అటువంటి దర్శనం చేసుకోలేరు. రూ.500 టిక్కెట్ పేరుతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే భయపడే విధంగా ఉంది. కనీసం భక్తుల సరిపడా రైల్వేస్టేషను, బస్టాండ్ నుంచి దేవస్థానం బస్సులను కూడా నడపడం లేదు. ఇతర ప్రధాన దేవాలయాల్లో సత్రాలు, డార్మటరీలు ఉన్నాయి. వాటిని ఏర్పాటు చేయకుండా టిక్కెట్ల ధరలు పెంచుతూ పోతే ఎలా.
- కిరణ్(పాల్వంచ), - సైదారావు(కారంపూడి)
భక్తుల మనోభావాలను గౌరవించాలి
భక్తుల మనోభావాలను దేవస్థానం అధికారులు గౌరవించాలి. ప్రసాదాలు, అన్నదాన విషయంలో పట్టించుకోని అధికారులు టిక్కెట్లు పెంచడం దారుణమన్నారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించిన తరువాత దర్శనం టిక్కెట్ల ధరలు పెంచే ఆలోచన చేయాలి. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆర్జిత సేవలు, దర్శనం టిక్కెట్ల ధరలు నిర్ణయించాలి. ప్రొటోకాల్, వీఐపీల పేరుతో ఉచిత సేవలు అందించే అధికారులు సామాన్యులకు కల్పించిన సౌకర్యాలు ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉంది.
- శ్యామల(ఖమ్మం), మోహన్కుమార్ (అచ్చంపేట)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!