logo

కట్టుకుంటారా... లాక్కోమంటారా?

అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం, పక్కా ఇల్లు సమకూర్చేందుకే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టామని చెప్పిన వైకాపా ప్రభుత్వం 2020 డిసెంబరు నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టింది.

Published : 03 Dec 2022 04:52 IST

ఇళ్లు నిర్మించకుంటే స్థలం తీసేసుకుంటాం
జగనన్న కాలనీ లబ్ధిదారులకు తాఖీదులు

బాపులపాడు మండలం కానుమోలు లేఔట్‌ దుస్థితి

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం, పక్కా ఇల్లు సమకూర్చేందుకే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టామని చెప్పిన వైకాపా ప్రభుత్వం 2020 డిసెంబరు నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 1,508 లేఔట్లలో దాదాపు 3.31 లక్షల మందికి స్థలాలు మంజూరు చేసింది. జగనన్న కాలనీల పేరిట వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పి అరకొరగా పనులు ప్రారంభించింది. నేటికీ అవి కొలిక్కి రాలేదు. చాలా లేఔట్లకు సామగ్రి తీసుకెళ్లేందుకు సరైన రహదారులు లేని దుస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించకుంటే పట్టా రద్దు చేసి, వేరే వారికి ఆ స్థలం ఇచ్చేస్తామంటూ అధికారులు తాఖీదులు ఇస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వసతుల్లేకుండా ఎలా?

బాపులపాడు మండలం కానుమోలులో రెండు చోట్ల వేర్వేరుగా లేఔట్లు వేసి 86 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఆ రెండు లేఔట్లకు ఇప్పటివరకు అప్రోచ్‌ రోడ్డు కూడా నిర్మించలేదు. ఇక అంతర్గత రహదారుల సంగతి సరే సరి. విద్యుత్తు లైన్లు సైతం వేయలేదు. వర్షం వస్తే మునిగిపోయే ఈ జగనన్న కాలనీల్లో అధికారుల ఒత్తిడితో 16 మంది నిర్మాణాలు ప్రారంభించారు. ఒక ఇల్లు పూర్తయినా నివాసం ఉండేందుకు కాలనీ అనువుగా లేని కారణంగా లబ్ధిదారు అద్దె ఇంటిలోనే ఉంటున్నారు. ఈ తరహా ఉదంతాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.

రెండేళ్లవుతున్నా అభివృద్ధి ఏదీ..?

ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా నేటికీ లేఔట్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. అనేక చోట్ల విద్యుత్తు, కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. కేవలం బోర్లు మాత్రమే వేశారు. అంతర్గత రహదారులను విడగొట్టి, వాటిని రాకపోకలకు అనువుగా అభివృద్ధి చేయలేదు. మురుగు పోయేందుకు కచ్చా కాల్వలు కూడా తవ్వలేదు. ఇవేమీ చేయకుండా ఇళ్లు కట్టకపోతే స్థలం తీసేసుకుంటామంటూ తాఖీదులు జారీ చేయడంపై లబ్ధిదార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామగ్రి వెళ్లడమే కష్టం..

కాలనీల్లో వసతులు, సదుపాయాల సంగతి ఎలా ఉన్నా, ముందుగా ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, ఇతరత్ర సామగ్రి తీసుకెళ్లేందుకు రెండు జిల్లాల పరిధిలో సగానికి పైగా లేఔట్లకు సరైన దారి లేకుండా పోయింది. చాలా చోట్ల ట్రాక్టర్లు దిగబడిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లు కట్టే ప్రదేశానికి సామగ్రి వెళ్లే వీల్లేక అర కి.మీ. దూరం నుంచి లబ్ధిదారులే మోసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి

మూడొంతులు బేస్‌మెంట్‌లోనే..

కృష్ణా జిల్లాకు 84,614, ఎన్టీఆర్‌ జిల్లాకు 83,633 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిల్లో కేవలం 6,959 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు జిల్లాల పరిధిలో 1,03,965 ఇళ్లు నేటికీ బేస్‌మెంట్‌ స్థాయికి దిగువనే ఉండటం గమనార్హం. నిర్మాణాలు చేపట్టకుంటే స్థలం లాగేసుకుంటారనే భయంతో లబ్ధిదార్లు బేస్‌మెంట్‌ వరకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో 90 శాతం లభ్ధిదార్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలనే ఆప్షన్‌ని ఎంచుకోవడంతో నిర్మాణాలు మందగమనంలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వసతుల లేమి, పెరిగిన నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా కడతారా, స్థలం వేరేవారికి ఇచ్చేయమంటారా అంటూ అధికారులు లిఖిత పూర్వక బెదిరింపులకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని