logo

ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించండి

ధాన్యం విక్రయానికి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు.

Published : 07 Dec 2022 03:36 IST

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ హారిక

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ధాన్యం విక్రయానికి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు. జడ్పీలో మంగళవారం నిర్వహించిన స్థాయి సంఘ సమావేశంలో రైతుల సమస్యలను వారు వివరించారు. రవాణా వాహనాలు, తేమ శాతం విషయంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలు పెరగడం, ధరలు తగ్గడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మృతి చెందిన పశువులకు బీమా సకాలంలో అందేలా చూడాలని నందిగామ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహనరావు కోరారు. గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్యం, పనులు తదితర స్థాయి సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. స్థాయి సంఘ సమావేశాలకు కొందరు అధికారులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా సమావేశానికి రాని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణాభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో మిషన్‌ అమృత్‌ సరోవర్‌ ద్వారా చేపట్టిన పనుల గురించి డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ వివరించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల్లో పురోగతిపై ఛైర్‌పర్సన్‌ ఆరా తీశారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల వ్యవసాయాధికారులు మనోహరరావు, విజయభారతి రెండు జిల్లాల పరిధిలో ఖరీఫ్‌ దిగుబడులు, ఈ- పంట నమోదు, పొలం బడి కార్యక్రమాల గురించి తెలియజేశారు. మొత్తం 2.25 లక్షల మంది రైతులకు రూ.4,200 కోట్లు, 19,745 మంది రైతులకు రూ.227 కోట్లు పంట రుణాలుగా ఇచ్చారని వెల్లడించారు. స్త్రీ, శిశు సంక్షేమం, రక్షణ స్థాయి సంఘ సమావేశంలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని కోరారు. కొన్ని నియోజకవర్గాల్లో బోర్లు తవ్వేందుకు ఎంఓయూ చేయించుకోడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదని సభ్యులు తెలిపారు. రైతులు ముందుకు వచ్చి బోర్లు వేసుకుంటే నిధులు వారికే నేరుగా మంజూరు చేస్తారని అధికారులు తెలియజేశారు. జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో జాప్యం చేసుకుంటోందని చెప్పారు. అన్ని బిల్లులు గృహ నిర్మాణ శాఖకు సమర్పించామని, నిధులు మంజూరైన వెంటనే లబ్ధిదారులకు చెల్లిస్తారని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ స్థాయి సంఘ సమావేశానికి జడ్పీ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ గరికపాటి శ్రీదేవి, స్త్రీ, శిశు సంక్షేమ సంఘ సమావేశానికి ఉంగుటూరు జడ్పీటీసీ సభ్యురాలు దుట్టా సీతారామలక్ష్మి, సాంఘిక సంక్షేమ సమావేశానికి వైస్‌ ఛైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. తొలుత అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు, డీపీవో నాగేశ్వరనాయక్‌, ఏడీ మైన్స్‌ రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని