logo

కల్యాణమస్తుకు ఆంక్షల ముడి

నందిగామలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహమైంది. కల్యాణమస్తు పథకం సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకుందామని సచివాలయానికి వెళ్లారు.

Updated : 24 Jan 2023 06:06 IST

కంచికచర్ల, న్యూస్‌టుడే: నందిగామలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహమైంది. కల్యాణమస్తు పథకం సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకుందామని సచివాలయానికి వెళ్లారు. అక్కడ వధూవరుల కుటుంబాల బియ్యం కార్డుల నకళ్లు అడగ్గా.. వధువుకు మాత్రమే బియ్యం కార్డు ఉంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నందున వరుడికి లేదు. ఇద్దరికీ బియ్యం కార్డు ఉంటేనే పథకం వరిస్తుందని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. కఠిన నిబంధనలతో తాజాగా అమలవుతున్న కల్యాణమస్తు పథకానికి ఎంతో మంది నూతన జంటలు అనర్హులవుతున్నారు.

నిబంధనలే అవరోధం

పేదల ఇంట్లో పెళ్లి చేయాలంటే ఆర్థిక భారంతో కూడిన వ్యవహారం. ఆ భారాన్ని తగ్గించేందుకు గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. వైకాపా అధికారం చేపట్టాక గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ పథకానికి వైఎస్సాఆర్‌ కల్యాణమస్తు, షాదీ-తోఫాగా నామకరణం చేసి నిబంధనలు కఠినతరం చేశారు. కల్యాణమస్తుకు దరఖాస్తు చేసుకోవాలంటే పెళ్లి ధ్రువపత్రంతో పాటు మరో 13 ధ్రువ పత్రాలు జత జేయాలి. ఎన్టీఆర్‌ జిల్లాలో 605 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద గతేడాది అక్టోబర్‌ నుంచి జనవరి 13 వరకు డీఆర్‌డీఏ పీడీ లాగిన్‌కు కేవలం 51 దరఖాస్తులు మాత్రమే అందాయి. చాలా సచివాలయాలకు ఇప్పటిదాకా దరఖాస్తులే రాలేదు. గతేడాది అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉమ్మడి జిల్లాలో వేలల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారందరూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

నాడు పేదలైతే చాలు

గత ప్రభుత్వంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న వధువు తల్లిదండ్రులు దరఖాస్తు చేస్తే నగదు అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టడంతో చాలా మంది పథకానికి దూరమవుతున్నారు. 2023లో ఏప్రిల్‌, జులై మినహా మిగిలిన నెలల్లో శుభ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత, విద్యుత్తు వినియోగం తదితర నిబంధనలు లబ్ధికి అవరోధంగా మారాయి. ఆర్థిక స్థోమత లేక చదువుకోని పేద కుటుంబాల ఆడ పిల్లలకు పథకం అందని ద్రాక్షగా మారింది.

అర్హులందరికీ లబ్ధి

అర్హులందరికీ లబ్ధి అందుతుందని, జనవరి 31లోగా దరఖాస్తు చేస్తే ఫిబ్రవరిలో, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తు చేసిన వారికి మేలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుందని డీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని