logo

రూ. 200 కోట్ల విలువైన మట్టి తరలింపు!

ఎకరా విస్తీర్ణం స్థలంలో 10 అడుగుల లోతులో తవ్వకాలు జరిపితే.. దాదాపు 15వేల నుంచి 18వేల వరకు ఘనపు మీటర్ల మట్టిని వెలికి తీసే అవకాశం ఉంది.

Published : 27 Jan 2023 03:54 IST

కొత్తూరు తాడేపల్లిలో వెలుగు చూస్తున్న నిజాలు
ఈనాడు, అమరావతి

కరా విస్తీర్ణం స్థలంలో 10 అడుగుల లోతులో తవ్వకాలు జరిపితే.. దాదాపు 15వేల నుంచి 18వేల వరకు ఘనపు మీటర్ల మట్టిని వెలికి తీసే అవకాశం ఉంది. అంటే మూడు ఘనపు మీటర్లు ఒక యూనిట్‌ కింద లెక్క. ఎకరా స్థలంలో 10మీటర్లలోతు తవ్వితే.. సుమారు 1200 వరకు లారీల మట్టి వస్తుందని గనులు, భూగర్భ గనుల శాఖ అధికారుల లెక్క. కానీ అక్కడ కనీసం 20 నుంచి 30 అడుగుల లోతు తవ్వారు. 150 ఎకరాలకు పైగా తవ్వేశారు. రూ.కోట్లు కూడబెట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ మండలం కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్‌, మట్టి తవ్వకాల తీరిది  

విజయవాడ మండలం కొత్తూరు తాడేపల్లిలో గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధి పేరుతో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా గ్రావెల్‌, మట్టి తవ్వకాలు జరిపారు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధి అండదండలూ ఉన్నాయి. ఇక్కడి నుంచి తరలిస్తున్న 14 మట్టి లారీలను యాధృచ్ఛికంగా తాడేపల్లి ఎస్‌ఐ పట్టుకున్నారు. గనులు, భూగర్భ గనుల శాఖ అధికారులు తనిఖీ చేస్తే.. మరో 9లారీలు మట్టిని తరలిస్తూ పట్టుబడ్డాయి. నగరానికి అతిసమీపంలో కొన్ని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తుంటే ఇంతకాలం అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు.. ప్రస్తుతం మొత్తం 23 లారీలకు జరిమానాలతో సరిపెట్టిన అధికారులు అక్రమ తవ్వకాలపై లెక్కలు తీసే పనిలో ఉన్నారు. ‘పెద్దల’ భాగస్వామ్యం  ఉండటంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తూరు తాడేపల్లి గ్రామం పరిధిలో  రైతుల అనుమతితో కొన్ని, అనుమతి లేకుండా కొన్ని తవ్వకాలు జరిగాయి. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి అనధికార అనుమతులు ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం 20 మంది రైతుల నుంచి పొలాలు తీసుకున్నారు. మామిడి తోటలు సైతం తవ్వకాలు జరిగాయి. పోలవరం కట్ట కింది భాగంలోనూ తవ్వకాలు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో కలిపి దాడదాపు 150 ఎకరాలకు పైగా తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. వీటిని లెక్కతీయడానికి సమయం పడుతుందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు.   ఒక్క లారీ మట్టి రూ.10వేల చొప్పున కనీసం రూ.200 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయని అంచనా.  


సూత్రధారులు తేలలేదు..!

తాడేపల్లిలో పట్టుకున్న 14 లారీలకు జరిమానా వేసి డ్రైవర్లకు తిరిగి అప్పగించారు. ఈ 14 లారీల యజమానులు ఎవరనేది గుర్తించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు అసలు దర్యాప్తు జరపకుండా గనుల శాఖకు ఇచ్చి వదిలేశారు.  ఓ ప్రజాప్రతినిధి సోదరుడి పేరుపై లారీ ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం 20 మంది వరకు రైతులను గుర్తించామని, వారికి నోటీసులు ఇవ్వనున్నామని అధికారులు చెబుతున్నారు.  మట్టి తవ్వకాల ద్వారా ఎక్కడికి తరలించింది గుర్తించి సీనరేజీ వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు