logo

న్యాయం చేయాలంటూ ఆందోళన

పట్టణంలో మంచినీటిని సరఫరా చేసే పురపాలక సంఘం ట్రాక్టర్‌ ఢీకొని మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద గురువారం మస్లిం మైనారిటీలు ఆదోళనకు దిగారు.

Published : 27 Jan 2023 03:54 IST

వైకాపా నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌తో చర్చిస్తున్న మహ్మద్‌ ఖాసీం తదితరులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో మంచినీటిని సరఫరా చేసే పురపాలక సంఘం ట్రాక్టర్‌ ఢీకొని మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద గురువారం మస్లిం మైనారిటీలు ఆదోళనకు దిగారు. యానాదుల కాలనీలో బుధవారం ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల బాలుడు అమీన్‌ నూర్‌(3) మృతి చెందాడని.. పురపాలక సంఘం భాధ్యత వహించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని కోరుతూ ముస్లిం మైనారిటీ నేత మహ్మద్‌ ఖాసీం (అబూ) ఆధ్వర్యంలో ఠాణా వద్దకు చేరారు. ఈ సందర్భంగా అబూ మాట్లాడుతూ బాలుడి మృతికి డ్రైవర్‌ అజాగ్రత్త కారణమని.. ఈ విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వచ్చి నష్ట పరిహారం అందిస్తానని మాట ఇచ్చే వరకూ బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరిలించే ప్రసక్తే లేదన్నారు. ఇంతజరిగినా బాలుడి తల్లిదండ్రుల వద్దకు ఇంత వరకూ కమిషనర్‌ రాకపోవడం అన్యాయమన్నారు. ఈ కేసులో కమిషనర్‌ ఏ1 అని ఆరోపించారు. బాలుడి కుటుంబానికి ఒక ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

న్యాయం చేస్తాం

గుడివాడ ఏరియా ఆసుపత్రిలో బాలుడి బంధువులు, మైనారిటీ నేత అబూ తదితరులతో చర్చలు జరిపిన వైకాపా నేత దుక్కిపాటి శశిభూషణ్‌ మాట్లాడుతూ అమీన్‌ నూర్‌ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని.. బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలన్నారు. దీంతో బాలుడి బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు.


బాలుడి మృతికి కారకుడైన డ్రైవర్‌ అరెస్టు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ యానాదుల కాలనీలో మంచినీటి ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ఢీకొన్న సంఘటనలో బాలుడి మృతి చెందిన కేసులో నిందితుడ్ని గురువారం అరెస్టు చేశామని టూటౌన్‌ సీఐ బి.తులసీధర్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని యానాదుల కాలనీలో మంచినీరు సరఫరాకు వచ్చిన ట్రాక్టర్‌ను డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపి బాలుడు అమీన్‌ నూర్‌(3) మృతికి కారకుడైన బొమ్ములూరుకు చెందిన కరేటి బుల్లిబాబును అరెస్టు చేసి ట్రాక్టర్‌ను సీజ్‌ చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని