logo

మళ్లీ మొదలెట్టేశారు

నందివాడ మండలం పుట్టగుంటలోని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు మళ్లీ మట్టి తవ్వకాలను మళ్లీ మొదలెట్టేశారు. సుమారు రూ. 9 కోట్ల ఖరీదు చేసే ఈ భూమిని కొందరు ఆక్రమించి గతేడాది అక్రమంగా చేపల చెరువులుగా తవ్వారు.

Published : 29 Jan 2023 05:27 IST

పుట్టగుంటలో ఎమ్మెల్యే అనుచరుల మట్టి అక్రమ తవ్వకాలు

ఆక్రమిత ప్రభుత్వ భూమిలో మట్టితవ్వి టిప్పర్లతో తరలింపు

న్యూస్‌టుడే, నందివాడ: నందివాడ మండలం పుట్టగుంటలోని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు మళ్లీ మట్టి తవ్వకాలను మళ్లీ మొదలెట్టేశారు. సుమారు రూ. 9 కోట్ల ఖరీదు చేసే ఈ భూమిని కొందరు ఆక్రమించి గతేడాది అక్రమంగా చేపల చెరువులుగా తవ్వారు. ప్రభుత్వం నుంచి ఇబ్బంది రాకుండా ఎమ్మెల్యే అనుయాయులే అక్రమ చెరువు తవ్వకాలు జరిపించి టన్నుల కొద్ది మట్టిని టిప్పర్లతో ప్రైవేటు వెంచర్లకు తరలించి రూ. కోట్లలో సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఆక్రమిత భూములపై గ్రామస్థులు, సీపీఎం వారు సైతం ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో భవిష్యత్తు భద్రతా దళం వ్యవస్థాపకుడు యలమంచిలి మురళీ కృష్ణ ప్రభుత్వ ఆక్రమిత భూములపై హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తున్పటికీ చెరువులను ఎండగట్టి వారం, పది రోజులుగా మళ్లీ టిప్పర్లతో పెద్దఎత్తున మట్టిని తవ్వి గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడంతో ఆయన శనివారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

సీలింగ్‌ చట్టం కింద అగ్రహారం పెద్దల నుంచి స్వాధీనం? : అగ్రహారంలోని పెద్దల నుంచి సీలింగ చట్టం కింద ప్రభుత్వం సుమారు 15 ఎకరాలను పూర్వం స్వాధీనం చేసుకొని 60, 70 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. బుడమేరు ముంపు ఎక్కువగా ఉండటంతో ఈ భూమిలో నాట్లు వేసింది లేదని, దశాబ్దాలుగా ఈ భూమి కాళీగా ఉండి తిరిగి ప్రభుత్వ పరమైందని అంటున్నారు. అయితే కొందరు అక్రమార్కులు అధికారులను లోబరచుకొని రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అక్రమంగా పట్టాలు పుట్టించారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అధికార పార్టీ అండదండలతో అక్రమంగా చేపల చెరువులు తవ్వి కబ్జా బాగోతాన్ని శాశ్వతంగా కప్పిపెట్టేసే ప్రయత్నాలు మురళీకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిలిచిపోయాయి. ఆక్రమిత భూమిపై కలెక్టరు సమగ్రంగా నివేదిక ఇవ్వకపోవడంతో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు.

టిప్పర్లతో గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌వైపు ప్రైవేటు వెంచర్లకు తరలిపోతున్న మట్టి

మెరకకు నోచుకోని జగనన్న లేఔట్లు : మండలంలో 27 జగనన్న లేఔట్లు వేశారు. జనార్దనపురంలో 3 లేఔట్లు ఉంటే ఒక్కదానిలోనే ఇళ్లు మొదలెట్టారు. మిగిలిన అన్ని చోట్లా మెరక చేయకపోవడంతో వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా పేదలు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు. స్థలాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్న పాలకులు వాటిని మెరక చేసేందుకు మట్టిలేదని చెబుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ భూముల్లో, బుడమేరు నుంచి టన్నులకొద్దీ మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలించి అక్రమాలకు పాల్పడం ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అక్రమంగా తవ్విన మట్టిని జగనన్న లేఔట్లకు తరలించి, ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు