logo

అమ్మ ప్రసాదం కొందరికే..

ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ అన్నప్రసాదం భక్తులందరికీ దొరకడం లేదు. పరిమిత సంఖ్యలో మాత్రమే అన్నదానం చేస్తుండటంతో కొందరికే పరిమితమైంది.

Published : 29 Jan 2023 05:37 IST

పరిమితంగా అన్నదానం
తీరు మార్చుకోని దుర్గగుడి అధికారులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ అన్నప్రసాదం భక్తులందరికీ దొరకడం లేదు. పరిమిత సంఖ్యలో మాత్రమే అన్నదానం చేస్తుండటంతో కొందరికే పరిమితమైంది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నా అన్నదానం స్వీకరించే భక్తుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.

మూడు దశాబ్దాల కిందట రూ.15 లక్షలతో దుర్గగుడిలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దాతలు విరాళాలు విరివిగా ఇవ్వడంతో ప్రస్తుతం రూ.94 కోట్లు ఉన్నాయి. దేవస్థానం నిబంధనల మేరకు దాతలు ఇచ్చిన విరాళాలపై ఎంత వడ్డీ వస్తుందో ఆ మొత్తంతో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయాలి. ఈ ప్రకారం ఇప్పుడు నిధులపై వచ్చే వడ్డీతో రోజుకు 6 వేల మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేసే అవకాశం ఉంది.

* 2014 వరకు దేవస్థానం రోజుకు 3 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతున్నందున అన్నప్రసాదాన్ని 5 వేల మందికి అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు భక్తులకు అన్నదానం పంపిణీ చేసేవారు. భక్తుల సంఖ్య, దాతల విరాళాలు పెరుగుతున్నప్పటికీ దేవస్థానం అధికారులు గతంలో నిర్ణయించిన దానికంటే తక్కువగా కేవలం 3,500 మందికి కుదించారు. ఆలయ ఖర్చు తగ్గించినట్లు చూపడానికి పంపిణీ చేసే సమయాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కుదించారు. ఇటీవల 2.30 గంటకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం లేదని చెప్పిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో వందలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించలేకపోతున్నారు. శుక్ర, ఆదివారాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

లిఫ్టులో అన్నం, సాంబారు తరలిస్తున్న సిబ్బంది

పంపిణీకి ఆటంకాలు

దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు అనేక ఆటంకాలను కల్పిస్తున్నారు. అన్నదాన భవనం తొలగించి ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. తాత్కాలిక షెడ్డు, శృంగేరి సత్రం కోసం దేవస్థానం రూ.2 కోట్లు ఖర్చుపెట్టింది. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా ఐదేళ్లుగా శృంగేరి సత్రంలో అన్నప్రసాదం వండి వాటిని నిత్యం ప్రత్యేక వాహనంలో మల్లికార్జున మహామండపానికి తరలించడానికి రూ.లక్షల్లో వ్యయం చేస్తున్నారు. వాటిని లిఫ్టుల్లో తరలిస్తున్నారు. నడవలేని భక్తులు, వృద్ధులు మాత్రం లిఫ్టులో రాకుండా అన్నప్రసాదం స్వీకరించే అవకాశం లేకుండా చేశారు. మూడో అంతస్తులో క్యూలైను పెట్టి అన్నప్రసాదం స్వీకరించే భక్తులను నడిచి రావాలని నిబంధన పెట్టడంతో అధికశాతం భక్తులు ప్రసాదం స్వీకరించే అవకాశం లేకుండా పోయింది. దాతలు అన్నప్రసాదానికి విరాళాలు ఇస్తున్నందున ఆ దామాషాలో భక్తులకు పంపిణీ చేసేందుకు ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని