logo

నీరసం.. ఆయాసం

బాలికలు, యువతులను రక్తహీనత వెంటాడుతోంది. పోషకాహార లోపం కారణంగా నీరసం, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.

Published : 31 Jan 2023 04:15 IST

రక్తహీనతతో బాధ పడుతున్న బాలికలు
న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

బాలికలు, యువతులను రక్తహీనత వెంటాడుతోంది. పోషకాహార లోపం కారణంగా నీరసం, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. మరోవైపు వారి ఎదుగుదల, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెలుగు చూసిన ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కోసం మందు బిళ్లలిస్తూ నెట్టుకొస్తున్నారు.

పోషకాహార లోపం వల్లే..

పేద, మధ్య తరగతి వర్గాల్లో ఆర్థిక కష్టాలతో రోజువారీగా తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు తగిన పరిమాణంలో తీసుకోవడం లేదు. పాలు, కోడిగుడ్లు, చేపలు, మాంసం తక్కువగా తింటున్నారు. దీంతో ఏ పనిచేసినా, ఎక్కువ సేపు నిలబడినా, కాస్త దూరం నడిచినా వెంటనే అలసిపోతున్నారు. అలసట, నీరసం, తలనొప్పి, కాళ్లనొప్పులు, తిమ్మిర్లు, ఆయాసం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టలే కపోతున్నారు.

జిల్లాలో ఇలా.. వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో కృష్ణా జిల్లాలో రాష్ట్రీయ కిశోర స్వస్త్య కార్యక్రమం(ఆర్‌కేఎస్‌కే) అమలులో భాగంగా 10-19 ఏళ్ల బాలికల్లో రక్తహీనత సమస్య ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 78,135 మంది విద్యార్థినుల్లో 11 గ్రాముల కంటే ఎక్కువ రక్తం ఉన్నవారు 29,995 మంది, 11 గ్రాములున్నవారు 22,951 మంది, 8 నుంచి 10 గ్రాములున్నవారు 24,651 మంది, 7 గ్రాముల కంటే తక్కువ ఉన్న విద్యార్థినులు 538 మందిగా గుర్తించారు.

తోట్లవల్లూరు పీహెచ్‌సీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని మొత్తం 1,662 బాలికలు ఉండగా సాధారణ స్థాయిలో రక్తం ఉన్నవారు 353 మంది, మైల్డ్‌గా 560 మంది, మోడరేట్‌గా 735 మంది, రక్తం అత్యంత తక్కువ శాతం ఉన్న బాలికలు 14 మంది ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.


మందులిస్తున్నాం

సాయిప్రసన్న, పీహెచ్‌సీ డాక్టరు, తోట్లవల్లూరు

క్తహీనత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన 10-19 ఏళ్ల వయసు గల బాలికలు, యువతులు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో తగినంత రక్తం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బిళ్లలు పంపిణీ చేస్తున్నాము. రక్తం తక్కువగా ఉన్నవారు మునగ ఆకు, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పాలు, కోడిగుడ్లు, మాంసం, చేపలు అధికంగా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని