logo

యూరియా ఎక్కడ?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. బస్తా ధర రూ.280కు గాను రూ.400 పైగా విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో యూరియా లభించకపోవడంతో తెలంగాణ జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నారు.

Published : 31 Jan 2023 04:15 IST

అదును తప్పుతోందని అధిక ధరలకు రైతుల కొనుగోలు
రూ.280 బస్తా... రూ.400కు విక్రయం
ఈనాడు, అమరావతి

న్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన రైతు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటకు యూరియా వేయాలి. పట్టణంలోని ఆర్‌బీకే, ఎరువుల దుకాణాల్లో సంప్రదించారు. యూరియా లేదు... మరో వారం వరకు దొరకడం కష్టమని చెప్పారు. చేసేది లేక తెలంగాణ రాష్ట్రం వీఎం బంజరులో ప్రైవేటు డీలరు వద్ద బస్తా రూ.400 చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా యూరియా ఎంఆర్‌పీ రూ.280 మాత్రమే. కొన్ని రూ.290 వరకు ఉన్నాయి. అదనంగా రూ.120 వరకు వెచ్చించాల్సి వచ్చింది. పది ఎకరాలకు దాదాపు 15 బస్తాలకు గాను రూ.1800 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. దానికి రవాణా ఖర్చులు అదనం.


కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన ఓ రైతు యూరియా కోసం సంప్రదిస్తే లభించలేదు. కొన్ని దుకాణాల్లో ఉన్నా.. కాంప్లెక్సు ఎరువులు కొంటేనే యూరియా విక్రయిస్తామనే సమాధానం వచ్చింది. కాంప్లెక్సు ఎరువుల ధర రకాలను బట్టి రూ.1100 వరకు ఉంది. ప్రస్తుత రైతులకు యూరియా మాత్రమే అవసరం ఉంది. అవసరం లేని కాంప్లెక్సు ఎరువులు కొనుగోలు చేయడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

సరకు లేదని మోపిదేవి సొసైటీలో బోర్డు

మ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. బస్తా ధర రూ.280కు గాను రూ.400 పైగా విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో యూరియా లభించకపోవడంతో తెలంగాణ జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నారు. అక్కడ కూడా బస్తా యూరియాకు సుమారు రూ.400 తీసుకుంటున్నారు. ప్రస్తుతం మెట్ట పంటలతో పాటు వరికి యూరియా అవసరం కావడంతో డిమాండ్‌ పెరిగింది. కొంత కొరత ఏర్పడగా.. డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు లభ్యం కావడం లేదు. ఒకరిద్దరు రైతులు సంప్రదిస్తే.. ముందు డబ్బులు చెల్లిస్తే తెప్పిస్తామని చెబుతున్నారు. ఒకరిద్దరి కోసం ఇండెంట్‌ పెట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు. దాంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. అధిక ధరలు వెచ్చించినా.. అదునుకు లభ్యం కావడం లేదని వాపోతున్నారు. అధికారులు మాత్రం యూరియా పుష్కలంగా ఉందని, కొరత తాత్కాలికమేనని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో యూరియా భారీగా నిల్వ ఉన్నట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా.. రైతులకు మాత్రం లభించడం లేదు. తిరువూరులోని ఎరువుల దుకాణాల్లో సోమవారం ఒక్క యూరియా బస్తా కూడా లభించలేదు. నందిగామలో యూరియా లేదనే సమాధానం రైతులకు ఎదురైంది.

30 వేల ఎకరాల్లో..

ఎన్టీఆర్‌ జిల్లాలో దాదాపు 30వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది. ఇప్పటికే కోత కోస్తున్న మిరప ఆఖరి దిగుబడి బాగా రావాలని యూరియా వినియోగిస్తారు. జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, కంచికచర్ల, మైలవరం, తిరువూరు ప్రాంత వాసులు తెలంగాణ జిల్లాలకు వెళ్లి యూరియా తెస్తున్నారు. ఖమ్మం, మధిర, వైరా, వీఎం బంజరు ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న దాదాపు 25 వేల ఎకరాల్లో వేశారు. ఇవి కాకుండా జి.కొండూరు, తిరువూరు మైలవరం ప్రాంతాల్లో కూరగాయల సాగు ఉంది. ఉద్యాన పంటలకు యూరియా అవసరం ఉంది.

15 వేల టన్నులు ఉంది

ఎన్టీఆర్‌ జిల్లా జేడీఏ విజయభారతి ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని రకాల ఎరువులు 51 వేల టన్నులు ఉన్నట్లు తెలిపారు. యూరియా సుమారు 15 వేల టన్నులు ఉందని ఆర్‌బీకేలకు పంపిస్తామని సమాధానం ఇచ్చారు. కృష్ణా జిల్లా జేడీఏ మనోహరరావు మాట్లాడుతూ అనవసరంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా అవసరం మేరకు ఉందని సమాధానం ఇచ్చారు. సోమవారం మరో వంద టన్నులు వచ్చిందని చెప్పారు. కాంప్లెక్సు ఎరువులు కొంటేనే యూరియా విక్రయిస్తామనే డీలర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు